ED Shock: జేసీ ప్రభాకర్ రెడ్డికి ఈడీ షాక్ - ఎన్నికల వేళ "ఫిక్స్"..!!
టీడీపీ సీనియర్ నేతలు జేసీ ప్రభాకర్ రెడ్డికి ఈడీ షాక్ ఇచ్చింది. ఏకంగా ఆస్తులను జప్తు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే బస్సుల కొనుగోలు వ్యవహారంలో ఈడీ విచారణకు జేసీ ప్రభాకర్ రెడ్డి పలు మార్లు హాజరయ్యారు. ఈడీ అధికారులు కోరిన సమాచారం అందించారు. బస్సుల కొనుగోలు వ్యవహారంలో అక్రమ లావాదేవీలకు పాల్పడ్డారంటూ ఈడీ అభియోగాలు మోపింది. ఇప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డితో పాటుగా గోపాల్ రెడ్డికి చెందిన రూ 22.10 కోట్ల మేర ఆస్తులను అటాచ్ చేస్తూ ఈడీ నిర్ణయం తీసుకుంది. ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ..ఈడీ తీసుకున్న నిర్ణయం రాజకీయంగా చర్చకు కారణమవుతోంది.
జేసీ ట్రావెల్స్ వాహనాల కొనుగోలులో అవకతవకలు, ఫోర్జరీ పత్రాలను సృష్టించి అక్రమ రిజిస్ట్రేషన్లకు పాల్పడ్డారని ఈడీ అభియోగాలు మోపింది. ఇదే కేసుకు సంబంధించి జేసీ ప్రభాకర్ రెడ్డిని గత నెలలో ఈడీ సుదీర్ఘంగా విచారించింది. రెండు రోజుల పాటు ప్రభాకర్ రెడ్డి ఈడీ ముందు విచారణకు హాజరయ్యారు. బస్సుల అక్రమ రిజిస్ట్రేషన్లకు సహకరించెందెవరు..ఇందులో ఎవరెవరి పాత్ర ఉందనే కోణంలో ఆరా తీసారు. అప్పటికే జేసీ బ్రదర్స్ నివాసాల్లో ఈడీ సోదాలు చేసింది. జేసీ బ్రదర్స్ ఎప్పటి నుంచో బస్సుల వ్యాపారంలో కొనసాగుతున్నారు. ఉత్తరాఖండ్ లోని అశోక్ లేలాండ్ కంపెనీ నుంచి స్క్రాప్ కింద వాహనాలను కొనుగోలు చేసి నాగలాండ్ లో బీఎస్-4 వాహనాలుగా మార్చారనే ఆరోపణలు ఉన్నాయి. బీఎస్ 3 వాహనాలను ఫోర్జరీ పత్రాల ద్వారా బీఎస్ 4గా మార్చారనే అభియోగాలు ఉన్నాయి. వీటిపై ఈడీ కేసు నమోదు చేసి విచారణ చేపడుతోంది.
ఒక బస్సు రిజిస్ట్రేషన్ మీదనే పలు బస్సులు నిర్వహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వీటన్నింటి పైన ఈడీ అధికారులు విచారణ చేసారు. అనంతపురం పోలీసులు రవాణా శాక అధికారుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసారు. ఇప్పుడు తాజాగా రూ 22.10కోట్ల ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ ప్రకటన చేసింది. రూ 38.36 కోట మేర అక్రమ లావాదేవీలు జరిగినట్లు తేల్చారు. ప్రభాకర్ రెడ్డి, గోపాల్ రెడ్డి ఆస్థుల అటాచ్ చేస్తున్నట్లు వెల్లడించారు. దివాకర్ ట్రావెల్స్ తో పాటుగా జఠధార ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్..సి. గోపాల్ రెడ్డి అండ్ కో చెందిన ఆస్తులు అటాచ్ లో ఉన్నాయి. సుప్రీం ఆదేశాలకు విరుద్దంగా జరిగిన బిఎస్3 వాహనాల కుంభకోణం కేసులో ఆస్తుల అటాచ్ చేసినట్లు ఈడీ పేర్కొంది. నకిలీ ఇన్వాస్ లు సృష్టించి బిఎస్ 4గా మార్చినట్టు గుర్తించినట్లు వివరించింది. నాగలాండ్, కర్నాటక, ఏపీలో రిజిస్ట్రేషన్స్ జరిగినట్టు గుర్తించారు. ఆర్టీవో అధికారులతో నకిలీ పత్రాలు సృష్టించి అక్రమ రిజిస్ట్రేషన్స్ చేసినట్టు ఆరోపణలు రావటంతో విచారణ చేసిన ఈడీ ఇప్పుడు ఆస్తులను ఎటాచ్ చేస్తూ నిర్ణయించింది. ఎన్నికల వేళ ఇప్పుడు ఇది కీలక పరిణామంగా మారుతోంది.