జగన్ కు కేంద్రం షాక్- రెబెల్ ఎంపీ రఘురామకు వై కేటగిరీ భద్రత- సంచలన నిర్ణయం..
ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు కేంద్రం భారీ షాక్ ఇచ్చింది. తమ పార్టీ తరఫున గెలిచి అసమ్మతి స్వరం వినిపిస్తున్న నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుకు ఆయన కోరిక మేరకు వై కేటగిరీ భద్రత కల్పించింది. తన సొంత నియోజకవర్గంలో పర్యటించేందుకు భయపడుతున్న రఘురామరాజుకు వై కేటగిరీ భద్రత కల్పించాలని కేంద్రం తీసుకున్న నిర్ణయం వైసీపీకి శరాఘాతంగా మారింది. అయితే కేంద్ర పెద్దలతో ఆయన నెరుపుతున్న సంబంధాలతో హోంశాఖ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చని తెలుస్తోంది.
ఏపీ సీఎం వైఎస్ జగన్ కు గుడి కడుతున్న వైసీపీ నాయకులు... ఎక్కడంటే !!
రఘురామకు వై కేటగిరీ భద్రత..
నరసాపురం నుంచి వైసీపీ ఎంపీగా గెలిచిన దాదాపు ఏడాది తర్వాత తన నియోజకవర్గం పరిధిలోకి వచ్చే వైసీపీ ఎమ్మెల్యేల తీరుపై విమర్శలు ప్రారంభించిన రఘురామకృష్ణంరాజు ఆ తర్వాత ఏకంగా అధినేత జగన్ వరకూ వచ్చేశారు. ఆ తర్వాత పార్టీ విధానాలను నిరంతరం విమర్శిస్తూ వార్తల్లో ఉంటున్నారు. దీంతో ఎమ్మెల్యేలు ఆయన వైఖరిపై పోలీసులకు ఫిర్యాదులు చేసే వరకూ వ్యవహారం వెళ్లింది. చివరకు నియోజకవర్గంలో ఎలా తిరుగుతావో చూస్తామంటూ వైసీపీ నేతల నుంచి వచ్చిన బెదిరింపులతో ఆయన ఏకంగా ఢిల్లీకి మకాం మార్చేశారు. చివరికి తనకు భద్రత పెంచాలని కేంద్రానికి మొరపెట్టుకున్నారు. పలువురు కేంద్రమంత్రులు, బీజేపీ పెద్దలను కలిసి ఈ మేరకు విజ్ఞప్తులు చేశారు. దీంతో చివరికి ఆయనకు వై కేటగిరీ భద్రత కల్పిస్తూ కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుందని ఆయన వెల్లడించారు.
వై కేటగిరీతో అదనపు భద్రత...
వాస్తవానికి ఎంపీగా ఆయనకు 2 ప్లస్ 2 గన్ మెన్లు మాత్రమే ఉంటారు. కానీ ప్రస్తుతం ఆయనకు వైసీపీ నేతల నుంచి ముప్పు ఉందంటూ చేసిన విజ్ఞప్తి మేరకు హోంశాఖ ఆయనకు వై కేటగిరీ భద్రత కల్పించింది. ఇందులో 10 నుంచి 11 మందితో భద్రత ఉంటుంది. తద్వారా ఆయన సాధారణ ఎంపీగా కాకుండా ఓ మేరకు వీఐపీ కేటగిరీలోకి మారిపోతారు. నియోజకవర్గానికి వెళ్లినా, ఢిల్లీలో పర్యటించిననా, పార్లమెంటుకు హాజరైనా ప్రత్యేక కాన్వాయ్ తో భద్రత కొనసాగుతుంది. దీంతో పాటు వై కేటగిరీ ఎంపీగా ఢిల్లీలోనూ పరపతి పెరుగుతుంది. కేంద్రం కొన్ని ప్రత్యేక పరిస్ధితుల్లో మాత్రమే ఇలా ఎంపీలకు భద్రత కల్పిస్తుంటుంది. ఇప్పుడు తాజాగా రఘురామకు భద్రత కల్పించిన విషయాన్ని ఆయనకు సమాచారం ఇచ్చిన కేంద్రం.. ఇవాళ అధికారికంగా లేఖ పంపనున్నట్లు తెలుస్తోంది.
జగన్కు భారీ షాక్...
వైసీపీ తరఫున గెలిచి ఆ పార్టీపైనే అసమ్మతి స్వరాలు వినిపిస్తున్న రఘురామకృష్ణంరాజుపై వేటు వేయాలని కోరుతూ వైసీపీ ఎంపీలు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి ఇప్పటికే విజ్ఞప్తి చేశారు. ఈ ఫిర్యాదుపై ఇంకా చర్యలు తీసుకోలేదు. ఆ లోపే రఘురామకృష్ణంరాజుకు వై కేటగిరీ భద్రత కల్పించడం వైసీపీతో పాటు అధినేత జగన్ కూ భారీ షాక్ గా మారబోతోంది. ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వం నుంచి ముప్పు పొంచి ఉందంటూ అదనపు భద్రత పొందబోతున్న రఘురామరాజు తన నియోజకవర్గంలో వైసీపీ నేతల ముందే కాన్వాయ్ తో తిరుగుతుండటం ఆ పార్టీకి ఊహించని దెబ్బగా మారబోతోంది. దీంతో జగన్ కేంద్రం నిర్ణయంపై ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.
Recommended Video
బీజేపీ భవిష్యత్ సంకేతాలు ఇచ్చిందా ?
ఇప్పటికే పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారనే ఫిర్యాదుతో రఘురామరాజుపై వేటుకు లోక సభ స్పీకర్ కు ఫిర్యాదు చేసిన వైసీపీ ఆయన్ను పార్లమెంటరీ కమిటీల నుంచి కూడా తప్పించాలని కోరింది. అయితే నెల రోజులవుతున్నా ఇప్పటికీ చర్యలు తీసుకోకపోగా అదనపు భద్రత కల్పిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు వైసీపీకి భారీ ఎదురుదెబ్బగా మారింది. అదే సమయంలో రఘురామరాజుకు అదనపు భద్రత కల్పిస్తూ తీసుకున్న నిర్ణయంతో ఆయనకూ, బీజేపీకీ మధ్య సంబంధాలు బలపడ్డాయా అన్న వాదన కూడా మొదలైంది. వైసీపీ తరిమిస్తే బీజేపీ పంచన చేరాలని భావిస్తున్న రఘురామరాజుకు అదనపు భద్రత నిర్ణయం ద్వారా బీజేపీ అండగా నిలుస్తోందన్న సంకేతాలు ఇవ్వడం సరికాదని వైసీపీ చెబుతోంది.