కులాంతర వివాహమే శాపమా..కోడలిపై అత్తమామల దాష్టీకం...చంటి బిడ్డతో సహా..!!
ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ యువతికి కులాంతర వివాహమే శాపమైంది. ప్రేమించి పెళ్లి చేసుకోవడం నేరమైంది. బాలింత అయిన కోడల్ని తమ కులం కాదు అన్న ఒకే ఒక్క కారణంతో ఇంట్లోకి రానివ్వని అత్తమామల దాష్టీకం ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది.
నేటికీ సమాజంలో కులాంతర వివాహాల పట్టింపు
శాస్త్ర సాంకేతిక రంగాలలో అభివృద్ధి చెందిన నేటి రోజుల్లోనూ కులాలు, మతాలు పేరుతో సమాజంలో వివక్ష కొనసాగుతుంది. కుల పట్టింపు తో పెద్దలు ఇంకా ప్రేమ పెళ్ళిళ్ళను అంగీకరించడం లేదు. నిత్యం ఎక్కడో ఒక చోట కులాంతర వివాహాల కారణంగా మహిళలు వేధింపులకు గురవుతున్నారు. ప్రేమించేటప్పుడు కులం పట్టింపులేని మగవాళ్ళు , పెళ్లయిన తర్వాత వారి కుటుంబ సభ్యుల ప్రమేయంతో కట్టుకున్న వారిని ఇబ్బంది పెడుతున్నారు. ఇలాంటి ఘటనలు నిత్యకృత్యంగా మారుతున్న పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది.
పసి బిడ్డతో ఇంటికి వచ్చిన బాలింత అయిన కోడలిపై అత్తమామల అమానుషం
ప్రేమించేటప్పుడు కులమేదైనా, మతమేదైనా పట్టింపు ఉండదు. పెళ్లి చేసుకునే సమయంలో కూడా పట్టింపులేని వాళ్ళు, పెళ్లయిన తర్వాత కులం పేరుతో కట్టుకున్న ఇల్లాలిని బాధిస్తున్న ఘటనలు అనేకం చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం కొత్తపేట పంచాయతీ టైలర్స్ కాలనీలో కొడుకు కులాంతర వివాహం చేసుకున్నాడు అన్న కారణంగా కోడలి పట్ల అమానుషంగా ప్రవర్తించిన ఘటన చోటుచేసుకుంది. ఇరవై మూడు రోజుల పసిబిడ్డ తో ఇంటికి వచ్చిన కోడలిని నిర్దాక్షిణ్యంగా ఇంట్లోకి రానివ్వకుండా బయటకు గెంటేసిన ఘటన చోటు చేసుకుంది.
కులం తక్కువ అని కోడలికి చిత్రహింసలు
సంఘటన వివరాల్లోకి వెళితే ఇంకొల్లుకు చెందిన రోజా కొత్తపేట గ్రామం టైలర్స్ కాలనీకి చెందిన గుంటి శ్రీనివాస్, ఆదిలక్ష్మి ల కుమారుడైన గుంటి దీపులును 2012లో ప్రేమ వివాహం చేసుకుంది. వారిద్దరిదీ కులాంతర వివాహం కావడంతో దీపులు తల్లిదండ్రులు ఆమెను అంగీకరించలేక పోయారు. కులం తక్కువ అని పదే పదే ఆమెను మానసికంగా చిత్రహింసలకు గురి చేశారు. పెళ్లయిన తర్వాత నుండి అత్తమామలు నిత్య రోజాను వేధిస్తున్నారు అని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది. కొద్ది రోజుల తరువాత వారే మారతారని ఆశించిన రోజా అత్తమామలు ఎంతకీ మారక పోవడంతో ఏడాది క్రితం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
గర్భవతిగా ఉన్న సమయంలోనూ గెంటివేత .. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు
పోలీసులను ఆశ్రయించిన ప్పటికీ ఆమెకు న్యాయం జరగలేదు. స్థానికంగా ఉన్న రాజకీయ నాయకులతో తన అత్తమామలకు సంబంధాలు ఉండడంతో వారి ప్రమేయంతో పోలీసులు కూడా ఈ కేసును పట్టించుకోవడంలేదని బాధితురాలు రోజా లబోదిబోమంటుంది. తాను ఎనిమిది నెలల గర్భవతి గా ఉన్నప్పుడు కూడా ఒకసారి ఇంటికి వచ్చానని, అప్పుడు కూడా ఇంట్లోకి రానివ్వకపోవడం తో పోలీసులకు ఫిర్యాదు చేశానని రోజా చెప్తున్నారు. స్థానిక నేతల పలుకుబడితో, పోలీసులు కూడా సైలెంట్ గా ఉంటున్నారు అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పోలీసులు తన సమస్యను అర్థం చేసుకొని పరిష్కరించాలని రోజా విజ్ఞప్తి చేశారు.
పోలీస్ స్టేషన్ కు వెళ్ళినా జరగని న్యాయం .. అత్తవారింటి ముందే రోజా ఆందోళన
అత్తమామలు ఇంట్లోకి రానివ్వకపోవడంతో, పోలీస్ స్టేషన్ కు వెళ్లినా న్యాయం జరగక పోవడంతో దిక్కుతోచని స్థితిలో రోజా అత్తవారింటి ముందే చంటి బిడ్డతో సహా నిరాహార దీక్షకు దిగారు. తన భర్తను కూడా పిలిపించాలని, తనకు న్యాయం చేయాలని రోజా డిమాండ్ చేస్తున్నారు. 23 రోజుల చంటి బిడ్డతో అత్తవారింటి ముందు రోజా ఆందోళన చేస్తున్న తీరు అందరి మనసులను కలచివేస్తోంది. కేవలం కులం కారణంగా కోడలి పట్ల ఇంత అమానుషంగా ప్రవర్తించడం దారుణమని స్థానికంగా చర్చ జరుగుతోంది.