మన్యం గెరిల్లా పోరాట యోధుడు.. గంటందొరను గుర్తుచేసుకుందాం!
స్వాతంత్య్ర పోరాటంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు తెలియనివారు ఉండరు. అయితే, ఆతని మరణానంతరం అల్లూరి బాటలోనే తెల్లదొరలపై తిరగబడ్డ మరో పోరాట యోధుడు గంటందొర గురించి చాలామందికి తెలియకపోవచ్చు. బ్రిటిష్ ప్రబుత్వంపై పోరుకు గిరిజనులతో గెరిల్లా సైన్యాన్ని తయారు చేసిన గొప్ప నాయకుడు గంటందొర. విముక్తి కోసం పాటుపడి.. తెల్లదొరల తూటాలకు ఎదురెళ్లి ప్రాణాలొదిలిన వీరుడతను. ఆగస్టు 15.. స్వాతంత్య్ర దినోత్వం పురస్కరించుకుని ఒక్కసారి గిరిజనుల ముద్దు బిడ్డ.. స్వాతంత్య్ర విప్లవ యోధుడు గంటందొరను గుర్తుచేసుకుందాం.
భారత స్వాతంత్ర పోరాటంలో గిరిజన నాయకుడు గంటందొర చిరస్మరణీయుడు. ఉమ్మడి విశాఖ జిల్లాలో పుట్టిన గంటందొర తెల్లదొరల నిరంకుశ పాలన నుండి అమాయక గిరిజనులకు విముక్తి కలిగించేందుకు తన జీవితాన్ని దారబోశారు. మన్యం వీరుడు అల్లూరితో కలిసి 1922 నుంచి 1924 వరకు ఆయన చేసిన పోరాటాలు బ్రిటిష్ ప్రభుత్వానికి కంటి మీద కునుకు లేకుండా చేశాయి. అల్లూరి సీతారామరాజుకి ప్రధాన అనుచరుడుగా, గిరిజనులకు పోరాట పాఠాలు చెప్పే గురువుగా ఉద్యమంలో ఆయన పాత్ర వెలకట్టలేనిది.

అల్లూరి తిరుగుబాటు వేగు చుక్కలా..
నిజానికి గంటందొర గ్రామ ముసబుగా ఉండేవారు. తన ప్రజలకు ఎలాంటి కష్టం రాకుండా చూసుకునేందుకు బ్రిటిష్ ప్రభుత్వం ఆదేశాలను లెక్కచేసేవారు కాదు. దీంతో అప్పటి గూడెం డిప్యూటీ తహసీల్దార్ సెబాస్టియన్ గంటందొరను ఇబ్బందులకు గురిచేసేవాడు. అలా ఆర్థికంగా దెబ్బతీసేందుకు ప్రభుత్వ సొమ్మును కాజేశాడంటూ నింద మోపి.. మునసబు పదవి నుంచి తప్పించేలా చేశారు. అక్రమంగా ఆస్తిపాస్తులను గుంజుకున్నారు. అప్పటికే బ్రటిష్ ప్రభుత్వంపై విసిగిపోయి ఉన్న గంటందొర అల్లూరి తిరుగుబాటు వేగు చుక్కలా కనిపించింది.
వీరుని తెగువకు అద్దం పట్టేలా..
అల్లూరితో కలిసి మన్యం విప్లవానికి సమర శంకం పూనారు. అప్పటికే గంటం దొర గిరిజనులకు సుపరిచితుడు కావడంతో 60 మంది గిరిజన పోరాటయోధులతో ఒక గెరిల్లా సైన్యాన్ని తయారు చేసి, దానికి ప్రధాన బాధ్యతను అల్లూరి గంటం దొర భుజాన వేశారు. అలా వీరిద్దరూ కలిసి బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేశారు. చింతపల్లి స్టేషన్పై దాడితో మొదలైన వీరి తిరుగుబాటు కృష్ణదేవిపేట పోలీస్ స్టేషన్, రాజవొమ్మంగి పోలీస్ స్టేషన్లను ఆక్రమించి, తుపాకులు, మందు గుండు సామాగ్రి ఎత్తుకెళ్లేంత వరకూ సాగింది. అంతేకాదు, అడ్డతీగల పోలీస్ స్టేషన్, రంపచోడవరం పోలీస్ స్టేషన్లను ముట్టడిస్తానని ముందుగానే మిరపకాయ టపా పంపి మరీ దాడి చేసి, స్వాధీనపరుచుకున్నారంటే ఈ వీరుని తెగువ ఎలాంటిదో అర్థమైపోతుంది.
అల్లూరి మరణానంతరం కూడా..
అల్లూరి మరణం మన్యం ఉద్యమంలో పెద్ద ఎదురుదెబ్బ. అయినప్పటికీ గంటందొర వెనకడుగు వేయలేదు. అల్లూరి సీతారామరాజు మరణం తర్వాత కూడా తెల్లదొరలపై విరుచుకుపడ్డారు. గెరిల్లా దాడులతో బ్రిటిష్ సైన్యాన్ని గడగడలాడించారు. చివరికి 1924వ సంవత్సరం జూన్ 7వ తేదీన కృష్ణదేవిపేట దగ్గరలోని సింగధార అనే ప్రదేశంలో బ్రిటిష్ సైన్యంపై పోరాడుతూ వారి తూటాలకు ఎదురు నిలిచి అసువులుబాసారు గంటందొర. ఇలాంటి విప్లవయోధుల స్ఫూర్తి నుంచి పుట్టుకొచ్చిన ఎందరో మన్యం వీరుల త్యాగం ఫలం స్వాతంత్య్రం. అందుకే గెరిల్లా పోరాట వీరుడు గంటందొరకు రెడ్ సెల్యూట్!












Click it and Unblock the Notifications