ఏపీని తీవ్రంగా హెచ్చరించిన వాతావరణశాఖ
ఏపీలో వర్షాలు కొనసాగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు నెమ్మదిగా విస్తరిస్తున్నాయి. ఉత్తరాంధ్ర మీదుగా ద్రోణి తూర్పు, పడమర మధ్య సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించాయి. రానున్న 24 గంటల్లో రాయలసీమలోని పలు ప్రాంతాల్లో ఈదురు గాలులు, పిడుగులు పడతాయని వాతావరణశాఖ వెల్లడించింది. కోస్తాలో తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నాయి. మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని సూచించింది.
ఎండ వేడి కూడా ఎక్కువే
రానున్న రెండురోజుల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయి. ఈరోజు విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, కడప జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడతాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కోస్తా, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడ్డాయి. మిగిలిన ప్రాంతాల్లో ఎండ వేడిమి షరా మాములుగానే ఉంది.

పిడుగులతోపాటు ఈదురు గాలులు
దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. వీటి ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు ఒడిసా, ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ వెల్లడించింది. రాబోయే ఐదు రోజులు ఈ రాష్ట్రాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని, ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో వర్షాలు పడుతున్నట్లు తెలిపింది. మరోవైపు తెలంగాణపై ఆవర్తనం కొనసాగుతోందని, ఏపీలోను నైరుతి రుతుపవనాలు నెమ్మదిగా కదులుతున్నాయని, వీటి ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు, ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో సాధారణ వర్షాలు పడతాయని అధికారులు చెప్పారు.












Click it and Unblock the Notifications