ఇండియా సెల్యూట్స్: విశాఖ సాగర తీరంలో అద్భుతం: కరోనా ఫ్రంట్లైన్ వారియర్స్ కోసం..
విశాఖపట్నం: ప్రాణాంతక కరోనా వైరస్ భయానకంగా విస్తరించడాన్ని నిలువరించడానికి అడ్డుగోడలా నిల్చున్న కోవిడ్-19 ఫ్రంట్లైన్ వారియర్స్. కరోనా వైరస్ బారిన పడిన వారిని రక్షించడానికి డాక్టర్లు, నర్సులు, ఇతర హెల్త్ వర్కర్లు అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఈ వైరస్ విస్తరించకుండా నిలువరించడానికి పారిశుద్ధ్య కార్మికులు, మున్సిపల్ సిబ్బంది తమ ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయట్లేదు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడానికి శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నారు.
Recommended Video
40 రోజులుగా అవిశ్రాంతంగా..
ఒకరి నుంచి మరొకరికి కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా అడ్డుకోవడానికి లాక్డౌన్ను అమలు చేస్తోన్న సమయంలో.. ప్రజలు ఇళ్లల్లో నుంచి బయటికి రాకుండా జాగ్రత్తగా కాపాడుకుంటున్నారు పోలీసులు. మండుతున్న ఎండలను సైతం లెక్కచేయట్లేదు వారు. కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి 40 రోజులుగా వారు పడుతున్న శ్రమను దేశం మొత్తం చూస్తోంది. ఈ ఫ్రంట్లైన్ వారియర్స్కు అభినందించకుండా ఉండలేకపోతోంది.

ఫ్రంట్లైన్ వారియర్లకు కృతజ్ఙతగా..
రెండుదశల్లో అమలులోకి తీసుకొచ్చిన లాక్డౌన్ ఆదివారం నాటికి 40వ రోజుకు చేరుకుంది. దీన్ని పురస్కరించుకుని త్రివిధ దళాలు.. ఫ్రంట్లైన్ వారియర్స్కు సెల్యూట్ చేయనున్నాయి. కాస్సేపట్లో ఈ కార్యక్రమం ఆరంభం కాబోతోంది. దేశవ్యాప్తంగా అన్ని ఆసుప్రతులపైనా వైమానిక దళాలు పూలవర్షాన్ని కురిపించనున్నాయి. డాక్టర్లు, నర్సులు, హెల్త్ వర్కర్లు, ఆసుపత్రుల్లో పని చేస్తోన్న సెక్యూరిటీ గార్డులు చేస్తోన్న సేవలకు గుర్తుగా వైమానిక దళాలు హెలికాప్టర్ల ద్వారా పూలను కురిపించబోతున్నారు.
విశాఖ ఆర్కే బీచ్ సమీపంలో రిహార్సల్స్..
అదే సమయంలో- నౌకాదళ అధికారులు..యుద్ధ నౌకల ద్వారా ఫ్రంట్లైన్ వారియర్స్కు కృతజ్ఙతలను తెలియజేయనున్నారు. దీనికోసం ఆదివారం రాత్రి తీర ప్రాంతాల్లో ప్రత్యేకంగా యుద్ధ నౌకల ద్వారా గాలిలోకి కాల్పులు జరిపి ఫ్రంట్లైన్ వారియర్స్కు ధన్యవాదాలను తెలియజేస్తారు. దీనికోసం విశాఖపట్నం ప్రధాన కేంద్రంగా పని చేస్తోన్న తూర్పు నౌకాదళం (ఈఎన్సీ) శనివారం రాత్రి రిహార్సల్స్ను నిర్వహించారు. విద్యుద్దీపాలతో అలంకరించిన రెండు యుద్ధ నౌకలు రాత్రి విశాఖ రామకృష్ణా బీచ్ సమీపంలో రిహార్సల్స్లో పాల్గొన్నాయి.

తీర ప్రాంతాల్లో నౌకాదళం రిహార్సల్స్..
రెండు యుద్ధనౌకలు ఎదురెదురుగా నిల్చుని, ఒకేసారి గాల్లోకి కాల్పులు జరిపి దీప కాంతులను వెలిగించాయి. ఆదివారం సాయంత్రం నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి రిహార్సల్స్ చేపట్టాయి. మొత్తం నాలుగు యుద్ధ నౌకలు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కేరళలో కూడా శనివారం రాత్రి రిహార్సల్స్ నిర్వహించారు. కోచి సమీపంలో సముద్ర తీర ప్రాంతంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నాలుగు యుద్ధనౌకలు పాల్గొన్నాయి.












Click it and Unblock the Notifications