రాష్ట్రపతికి ఘనస్వాగతం
భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆంధ్రప్రదేశ్ పర్యటనకు విచ్చేశారు. రెండు రోజుల రాష్ట్ర పర్యటనలో భాగంగా ఉదయం 11.00 గంటలకు ఆమె గన్నవరం విమానాశ్రయానికి చేరుకోగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి జగన్, కేంద్రమంత్రి కిషన్రెడ్డి రాష్ట్రపతికి ఘనస్వాగతం పలికారు. అనంతరం విమానాశ్రయంలో ద్రౌపదీ ముర్ము పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. రాష్ట్రపతి పర్యటన ఉండటంతో గన్నవరంతోపాటు పరిసర ప్రాంతాల్లోను పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.

పోరంకిలోని ఓ ప్రైవేటు కన్వెన్షన్ సెంటర్లో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్రపతికి పౌర సన్మానం జరగనుంది. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్తో పాటు రాష్ట్రంలోని పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. తర్వాత రాజ్భవన్లో రాష్ట్రపతి గౌరవార్థం గవర్నర్ అధికారికంగా విందు ఇస్తారు. తర్వాత 2.35 గంటలకు గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో విశాఖపట్నంకు వెళతారు. అక్కడ రక్షణశాఖ, ఉపరితల రవాణాశాఖలకు చెందిన పలు ప్రాజెక్టులను వర్చువల్ విధానంలో ద్రౌపది ముర్ము ప్రారంభిస్తారు.

మరి కొన్నింటికి శంకుస్థాపనలు కూడా ఉంటాయి. సాయంత్రం 4.25 నుంచి 6.00 గంటల వరకు ఆర్కే బీచ్లో నౌకాదళ విన్యాసాలను తిలకిస్తారు. రాత్రి 8.00 గంటలకు విశాఖ నుంచి బయలుదేరి 8.40కి తిరుపతి చేరుకుంటారు. రాత్రి తిరుమలలోని పద్మావతి అతిథిగృహంలో బస చేసి సోమవారం ఉదయం 5.30 గంటలకు తిరుమల శ్రీ వారిని దర్శించుకుంటారు. ఉదయం 10.50 నుంచి 11.10గంటల వరకు పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో విద్యార్థినులతో జరిగే ముఖాముఖిలో పాల్గొంటారు.













Click it and Unblock the Notifications