ఘనత ఇందిరదే, ఆమె అన్నదే చెప్పా: సమైక్యంపై కిరణ్
విశాఖపట్నం/న్యూఢిల్లీ/విజయవాడ: ఆంధ్రప్రదేశ్ను సమైక్యంగా ఉంచిన ఘనత దివంగత ఇందిరా గాంధీదేనని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ఇందిర 29వ వర్ధంతి సందర్భంగా గురువారం విశాఖలో ఆమె విగ్రహానికి కిరణ్ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడారు. 1969, 1972 ఉద్యమాల తర్వాత రాష్ట్రం కలిసి ఉండాలని చెప్పిన ఏకైక వ్యక్తి ఇందిరా గాంధీ అన్నారు.
తాను ఇప్పటి వరకు ఇందిరా చెప్పిన మాటలనే ఉటంకిస్తున్నట్లు చెప్పారు. అభివృద్ధికి ఇందిరా గాంధీయే కారకులన్నారు. ఆమె తన చివరి రక్తపు బొట్టు వరకు దేశాన్ని బలోపేతం చేశారని, ఆమె మరణం వల్లే రాష్ట్రానికి ఇలాంటి దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాదు రాష్ట్రాన్ని దేశంలో విలీనం చేసిన ఘనత సర్దార్ వల్లబాయ్ పటేల్ది అన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచిన ఇందిరా గాంధీ, ఇదే విషయాన్ని పలుమార్లు పార్లమెంటులో చెప్పారన్నారు.
ఢిల్లీలో ఇందిరకు నివాళులు
మరోవైపు దేశ రాజధాని న్యూఢిల్లీలో ఇందిర గాంధీ సమాధి ఉన్న శక్తి ఘాట్ వద్ద రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని మన్మోహన్ సింగ్, యూపిఏ అధ్యక్షురాలు సోనియా గాంధీ, పలువురు నేతలు నివాళులు అర్పించారు. రాష్ట్రంలోను కాంగ్రెసు నేతలు ఇందిరా గాంధీకి నివాళులు అర్పించారు.
బాధితులను ఆదుకోవడంలో విఫలం: చంద్రబాబు
విపత్తులను ఎదుర్కొన బాధితులను ఆదుకోవడంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి విఫలమయ్యారని టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఆయన విజయవాడలో విలేకరులతో మాట్లాడారు. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి వరద నష్టం వివరాలు పంపలేదని, బాధితులకు భరోసా, అధికారులకు మార్గదర్శకాలు ఇవ్వడంలో ముఖ్యమంత్రి విఫలమయ్యారని ఆరోపించారు.