జగన్కు షాక్: కాంగ్రెసులోకి తిరిగి ఇంద్రకరణ్ రెడ్డి
మాజీ పార్లమెంటు సభ్యుడు అయిన ఇంద్రకరణ్ రెడ్డి మంగళవారంనాడు హైదరాబాదులో తెలంగాణ పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యను, ఎన్నికల ప్రణాళిక కమిటీ కో చైర్మన్ షబ్బీర్ అలీని కలిశారు. ఇంద్రకరణ్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్ అసెంబ్లీ స్థానాన్ని ఆశిస్తున్నారు. అయితే, కాంగ్రెసు ఆదిలాబాద్ శాసనసభా స్థానాన్ని కేటాయించేందుకు సముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది.
మాజీ పార్లమెంటు సభ్యులు ఇంద్రకరణ్ రెడ్డి నిరుడు ఆగస్టులో వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేశారు. తెలంగాణపై పార్టీ వైఖరికి నిరసనగానే రాజీనామా చేసినట్లు ఆయన చెప్పారు. ప్లీనరీలో ఇచ్చిన మాట తప్పినందు తాను ఆవేదన చెందానని, ఏ పార్టీలో చేరేది త్వరలో చెబుతానని ఆయన అప్పట్లో అన్నారు.
ఇంద్రకరణ్ రెడ్డి ఆదిలాబాద్ లోకసభ స్థానం నుంచి పదవ లోకసభకు 1991-96 మధ్య కాలంలో కాంగ్రెసు తరఫున ప్రాతినిధ్యం వహించారు. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో గెలిచి 14వ లోకసభలో కూడా అదే నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు.