సచివాలయ కూల్చివేతపై మల్లు లాజిక్
హైదరాబాద్: సీఎం కేసీఆర్ ట్రాప్లో గవర్నర్ చిక్కుకోవద్దని కాంగ్రెస్ నేత మల్లు రవి సూచించారు. గ్రేటర్లో రోడ్ల కుంభకోణంపై గవర్నర్ ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. రైతులు, విద్యార్థులు రోడ్డెక్కిన విషయం గవర్నర్కు తెలియదా? అని ఆయన ప్రశ్నించారు. సర్కార్ను జానారెడ్డి ప్రశంసించడం సమర్ధనీయమే అని, నల్గొండలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేసినందుకు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అభినందించడంలో తప్పులేదని మల్లు రవి తెలిపారు. ప్రజల సమస్యల గురించి మాట్లాడిన ప్రతిపక్ష పార్టీ నేతలపై రాష్ట్ర మంత్రులు, అధికారపార్టీ నేతలు అహంకారపూరితంగా మాట్లాడుతున్నారని ఆయన ఆరోపించారు. ప్రచారం కోసం ర్యాంకులు తెచ్చుకోవడానికి, ర్యాంకుల కోసం లాబీలు చేయడానికి ఉన్న శ్రద్ధ పరిపాలనపై లేదన్నారు. ప్రతిపక్షాలు కూడా టీఆర్ఎస్ చేస్తున్న తప్పులకు భజన చేయాలని కోరుకుంటున్నట్టుగా ఉందన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎవరు ప్రశ్నించినా ఎదురుదాడి చేస్తున్నారని విమర్శించారు. కోట్ల రూపాయలను ప్రచారం కోసం ఖర్చు పెడుతూ, ప్రజల సమస్యల పరిష్కారాన్ని పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. సచివాలయాన్ని ఎందుకు కూలుస్తున్నారని ప్రశ్నించారు. ఉమ్మడి ఏపీకి సరిపోయిన సచివాలయం తెలంగాణకు సరిపోదా?.. అని ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు. హామీలు నెరవేర్చకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన ఆరోపించారు