ఇన్నోవా కారును తగులబెట్టిన గంజాయి స్మగ్లర్లు
విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లాలోని ఎస్రాయవరం మండలం పెద్దగుమ్మతారు గ్రామంలో ఇన్నోవా కారును గంజాయి స్మగ్లర్లు తగులబెట్టారు. ఇన్నోవా కారులో స్మగ్లింగ్ జరుగుతున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు రెడ్హ్యాండెడ్గా పట్టుకునేందుకు పథకం వేశారు. దీన్ని గమనించిన స్మగ్లర్లు పోలీసులు పట్టుకుంటారనే భయంతో కారును చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి తగులబెట్టి పరారయ్యారు. కారులో ఉన్న డమ్మీ తుపాకీ, రెండు కత్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులపైకి కూలీల ఎదురు దాడి
ఎర్రచందనం దుంగలను తరలించేందుకు వచ్చిన కూలీలు పోలీసులపై ఎదురుదాడికి దిగిన సంఘటన కడప జిల్లా కోడూరు మండలం మాధవరాంపాడు వద్ద శనివారం ఉదయం జరిగింది. తమిళనాడుకు చెందిన ఈ కూలీలు ఒక్కసారిగా తిరగబడటంతో పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారు. దాంతో కూలీలు పలాయనం చిత్తగించారు. ఈ సందర్భంగా 50 లక్షల రూపాయల విలువచేసే ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఏనుగుల బీభత్సం
చిత్తూరు జిల్లాలో గజరాజుల దాడులు కొనసాగుతున్నాయి. శనివారం రామకుప్పం మండలం పాడూరగడ్డలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. ఐదు ఎకరాల్లో వరిపంటను గజరాజులు ధ్వంసం చేశాయి. ఏనుగుల దాడిలో ధ్వంసమైన పంట పొలాలను ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి శనివారం ఉదయం పరిశీలించారు. కుప్పం మండలం కూసూరు, తదితర ప్రాంతాల్లో గత కొద్ది రోజులుగా ఏనుగులు పంట పొలాల్లో ప్రవేశించి పంటను ధ్వంసం చేశాయి. నష్టపోయిన రైతులను ఆదుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.
దంపతుల ఆత్మహత్యాయత్నం
కుటుంబ కలహాలతో దంపతులు ఆత్మహత్యకు యత్నించిన సంఘటన కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం మానికొండలో శనివారం ఉదయం చోటు చేసుకుంది. వొంటిపై కిరోసిన్ పోసుకుని ఈ దంపతులు నిప్పంటించుకొన్నారు. వెంటనే గమనించిన స్థానికులు గాయపడిన ఇద్దరినీ విజయవాడ ఆస్పత్రికి తరలించారు.