అమ్మా! బతకాలని ఉంది, కానీ: 'నారాయణ' విద్యార్థిని ఆత్మహత్య
కాకినాడ: కాకినాడలోని నారాయణ కళాశాలకు చెందిన విద్యార్థిని భారతి గురువారం ఉదయం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భారతి ఎంపిసి ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఆమె తాను ఉండే గదిలోనే ఫ్యానుకు చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
తూర్పు గోదావరి జిల్లాలోని సఖినేటిపల్లి మండలం గొంది గ్రామానికి చెందిన భారతి రాజమహేంద్రవరంలోని తన పెద్దమ్మ వద్ద భారతి ఉంటోంది. తండ్రి గెడ్డం సత్తిబాబు మద్యానికి బానిస కావడం, తల్లి ఉద్యోగ రీత్యా దుబాయ్లో ఉంటుండటంతో తాను ఒంటరితనాన్ని భరించలేకే ఆత్మహత్యకు పాల్పడినట్టు ఆత్మహత్యకు ముందు రాసినట్టు భావిస్తున్న లేఖలో పేర్కొందని పోలీసులు చెబుతున్నారు.
భారతి ఆత్మహత్య నేపథ్యంలో విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. నారాయణ విద్యా సంస్థ విద్యార్థులపై తెస్తున్న ఒత్తిళ్ల కారణంగానే ఆత్మహత్యలు జరుగుతున్నాయని ఎస్ఎఫ్ఐ ఆరోపించింది. రాష్ట్ర మంత్రి నారాయణకు చెందిన కళాశాలల్లో ఇటువంటి ఆత్మహత్యలు అనేకం జరిగాయని వైసిపి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు ఆరోపించారు.
మద్యం మానేయమని నాన్నతో ప్రమాణం చేయించండి
తన బాధలు చెప్పుకునేందుకు అమ్మ దగ్గర లేదని, తండ్రి మద్యానికి బానిసయ్యాడని, హాస్టల్లో ఒంటరి బతుకు తనకు నచ్చడం లేదని, తనకు ఇష్టమైన స్నేహితులు మాట్లాడక పోవడంతో బతకాలని లేదని, చచ్చిపోవాలని ఉందని, అక్కకు బిడ్డ రూపంలో మళ్లీ పుడతానని, అప్పుడైనా తనను ప్రేమగా చూసుకోవాలని, నేను చనిపోయాక నాన్నను తన మృతదేహం వద్దకు తీసుకు వచ్చి.. మద్యం మానేస్తానని ప్రమాణం చేయాంచాలని, బతకాలని చిన్న ఆశ ఉన్నప్పటికీ, బతకాలని లేదని, అక్క, తమ్ముడిని బాగా చూసుకోవాలని, అమ్మా.. నువ్వంటే నాకు ఇష్టం.. అని ఆమె లేఖలో రాశారని తెలుస్తోంది.