జ్యోతుల షాకిచ్చాక..: ద్వారంపూడి చక్రం, లెక్కలతో ముందుకెళ్తున్న జగన్
రాజమహేంద్రవరం: గత సార్వత్రిక ఎన్నికల్లో వైసిపి తరఫున గెలిచిన జ్యోతుల నెహ్రూ, ఆయన తోడల్లుడు వరుపుల సుబ్బారావులు తెలుగుదేశం పార్టీలో చేరారు. నిన్నటి వరకు వైసిపిలో జ్యోతుల నెహ్రూ కీలక నేత. ఇప్పుడు అలాంటి కీలక నేత పార్టీ నుంచి వెళ్ళిపోవడంతో తూర్పు గోదావరి జిల్లాలో జగన్కు చిక్కులు వచ్చి పడుతున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి.
పార్టీలో వైసిపి నేతల మధ్య అంతర్గత పోరు, ఆధిపత్య పోరు కనిపిస్తోందని మీడియాలో వార్తలు వస్తున్నాయి. జ్యోతుల నెహ్రూ వైసిపిని వీడిన తర్వాత తూర్పు గోదావరి జిల్లాలో వైసిపి పైన బాగానే ప్రభావం పడిందనే వాదనలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలో ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి, ముత్తా గోపాల కృష్ణ, జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు, జక్కంపూడి తదితరులు కీలక నేతలు. జ్యోతుల నెహ్రూ పార్టీ వీడిన తర్వాత వీరి మధ్య ఆధిపత్యం పోరు మరింత కనిపిస్తోందని అంటున్నారు.
ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి పార్టీ అధినేత వైయస్ జగన్కు మంచి సంబంధాలు ఉంటాయనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే, ఇటీవలి కాలంలు కులాల ఈక్వేషన్ పరిస్థితుల నేపథ్యంలో, పైగా రానున్న కాకినాడ కార్పోరేషన్ ఎన్నికల దృష్ట్యా జగన్.. రెడ్డి సామాజికవర్గం ఎక్కువగా ఉండే అనపర్తి, లేదా పునర్ విభజన జరిగితే అనుకూలమైన మరోచోటుకి ద్వారంపూడిని మార్చాలని భావిస్తన్నాడని అంటున్నారు.
అయితే, ద్వారంపూడికి రాజకీయంగా, ఆర్థికంగా కాకినాడలోనే పట్టు ఉంది. దీంతో ఆయన కాకినాడను వదిలేందుకు సిద్ధంగా లేరు. ఇక్కడ జగన్.. ముత్తా వర్గానికి ప్రాధాన్యత ఇస్తున్నారని వార్తలు వస్తున్నాయి.
కాకినాడ విషయంలో ద్వారంపూడిని జగన్ ప్రస్తుతానికి పక్కకు పెట్టినప్పటికీ.. వారిద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యం చూస్తే అది తాత్కాలికమేనని కూడా చెబుతున్నారు. కాకినాడలో ఖాళీను పూరించేందుకు ముత్తా వర్గాన్ని ఎంచుకున్నారని అంటున్నారు.
ఇదే సమయంలో జిల్లా నాయకత్వాన్ని ఎవరికి అప్పగించాలనే విషయమై కూడా చర్చోపచర్చలు జరిగాయని, చివరకు కన్నబాబుకు అప్పగించారని అంటున్నారు. సామాజిక వర్గం లెక్కల కారణంగా జగన్.. ద్వారంపూడికి పగ్గాలు అప్పగించలేకపోతున్నారని అంటున్నారు.
కొద్ది నెలల క్రితం కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే కన్నబాబును పార్టీ జిల్లా అధ్యక్షుడిని చేశారు. ద్వారంపూడి ఇతరుల పేర్లు సూచించినప్పటికీ.. కొన్ని లెక్కల కారణంగా జగన్.. కన్నబాబుకు అవకాశమిచ్చారని అంటున్నారు.
జిల్లాలో ద్వారంపూడి అనధికార అధ్యక్షుడిగా వ్యవహరిస్తారనే వాదనలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో జ్యోతుల నెహ్రూ పార్టీని వీడిన తర్వాత వైసిపి తూగో రాజకీయాలు మరింత ఆసక్తిగా మారాయంటున్నారు. కాకినాడ కార్పోరేషన్ ఎన్నికల నాటికి ఏమవుతుందోననే ఆసక్తికర చర్చ సాగుతోంది.












Click it and Unblock the Notifications