గవర్నర్ చెంతకు ఇంటర్ పరీక్షల పంచాయతీ
హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నెలకొన్న ఇంటర్మీడియట్ పరీక్షల పంచాయతీ గవర్నర్ నరసింహన్ చెంతకు చేరింది. ఇంటర్మీడియట్ పరీక్షలను విడిగా నిర్వహించడానికి సిద్ధపడిన తెలంగాణ ప్రభుత్వంపై తెలంగాణ మంత్రులు గంటా శ్రీనివాస రావు, కామినేని శ్రీనివాస్, అచ్చెన్నాయుడు ఫిర్యాదు చేశారు. వారు నరసింహన్తో భేటీ అయి, తెలంగాణ ప్రభుత్వ వైఖరిని వివరించారు. ఉమ్మడి పరీక్షల నిర్వహణ అంశాన్ని వారు గవర్నర్కు వివరించారు.
గవర్నర్తో భేటీ తర్వాత గంటా శ్రీనివాస రావు మీడియాతో మాట్లాడారు. తమ నివేదికపై గవర్నర్ సానుకూలంగా ప్రతిస్పందించారని ఆయన చెప్పారు. రేపు (బుధవారం) సాయంత్రం ఇరు రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులతో మాట్లాడుతానని గవర్నర్ హామీ ఇచ్చినట్లు తెలిపారు. పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఎలాంటి బేషజాలకు పోకుండా తెలంగాణ ప్రభుత్వంతో చర్చించడానికి సిద్దంగా ఉన్నామని చెప్పారు.

విడివిడిగా పరీక్షలు నిర్వహిస్తే విద్యార్థులకు నష్టం జరుగుతుందని గంటా అన్నారు. తాము గవర్నర్ జోక్యాన్ని కోరామని, అలా పరిష్కారం కాకుంటే తెలంగాణ ప్రభుత్వంపై కోర్టుకు వెళ్తామని చెప్పారు. వెయిటేజ్ ఉండడంతో విడివిడిగా పరీక్షలు నిర్వహిస్తే విద్యార్థులకు నష్టం జరుగుతుందని అన్నారు. విభజన వివాదాలను పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని అభిప్రాయపడ్డారు.
కాగా, తెలంగాణ విద్యాశాఖ కార్యదర్శి వికాస్ రాజు గవర్నర్ నరసింహన్ను కలిశారు. విడివిడిగా పరీక్షల నిర్వహణ ఎలా సాధ్యమని గవర్నర్ ఆరా తీసినట్లు సమాచారం. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు కూడా మంగళవారం సాయంత్రం గవర్నర్ను కలిశారు.
ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణకు విడిగా సిద్ధపడిన తెలంగాణ ప్రభుత్వం టైం టేబుల్ను కూడా ప్రకటించింది. తెలంగాణ ప్రభుత్వ తీరుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్రంగా మండిపడుతోంది. తాము తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన తేదీల్లోనే పరీక్షలను ఉమ్మడిగా నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని కూడా ప్రకటించింది.












Click it and Unblock the Notifications