చిలకలూరిపేట టీడీపీలో ముసలం?
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ముగ్గురు శాసనమండలి సభ్యులు అధికార తెలుగుదేశం పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయన చేతుల మీదుగా పసుపు కండువా కప్పుకొన్నారు. ఆ ముగ్గురూ- మర్రి రాజశేఖర్, కర్రి పద్మశ్రీ, బల్లి కళ్యాణ్ చక్రవర్తి ఇదివరకే వైఎస్ఆర్సీపీకి గుడ్ బై చెప్పారు. తమ పదవులకూ రాజీనామాలు చేశారు. తాజాగా టీడీపీలో జాయిన్ అయ్యారు.
మిగిలిన ఇద్దరి మాటెలా ఉన్నప్పటికీ.. మర్రి రాజశేఖర్ చేరిక వ్యవహారం దుమారం రేపుతోంది. పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలో అసమ్మతిని రాజేసింది. ఆయన చేరికపై నియోజకవర్గానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకులు బహిరంగంగానే తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ విషయంపై కొందరు సీనియర్లు బాహటంగానే విమర్శలు గుప్పిస్తోన్నారు.

పార్టీ క్యాడర్ కు టీడీపీ అగ్రనాయకత్వం కనీస సమాచారం ఇవ్వలేదని అంటున్నారు. మాటమాత్రమైనా చెప్పకుండా, ముందస్తు సమాచారం లేకుండా ఎలా తీసుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేస్తోన్నారు. ఇదంతా కూడా నరసరావుపేట లోక్ సభ సభ్యుడు లావు శ్రీకృష్ణదేవరాయలు చేస్తోన్న కుట్రగా అభివర్ణిస్తోన్నారు. ఆయనపై చిలకలూరిపేట టీడీపీ నాయకులు మండిపడుతున్నారు. ఇన్ని సంవత్సరాల పాటు మర్రి రాజశేఖర్ కు వ్యతిరేకంగా పోరాడామని గుర్తు చేస్తోన్నారు.
అలాంటప్పుడు కనీసం కార్యకర్తల మనోభావాలు గౌరవించకుండా.. కనీస సమాచారం అయినా ఇవ్వకుండా ఆయనను పార్టీలోకి ఎలా తీసుకుంటారని ప్రశ్నిస్తోన్నారు. మర్రి రాజశేఖర్ చేరిక విషయంలో అధిష్టానం పునరాలోచించాలని అల్టిమేటం ఇచ్చారు. లేనిపక్షంలో పార్టీకి, తమ పదవులకు రాజీనామా చేస్తామని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications