నెల్లూరు వైసీపీలో మంత్రి పదవి చిచ్చు-కాకాణి వర్సెస్ అనిల్-ఏకమవుతున్న వ్యతిరేకులు ?
2019 ఎన్నికల్లో వైసీపీకి ఏపీలో క్లీన్ స్వీప్ సీట్లు సాధించిపెట్టిన జిల్లాల్లో నెల్లూరు కూడా ఒకటి. ఇక్కడ పదికి పది సీట్లు గెల్చుకున్న వైసీపీకి అదే శాపంగా మారుతోందా అంటే అవుననే సమాధానం అప్పుడప్పుడూ వినిపిస్తుంటుంది. ఇప్పుడు తాజాగా జగన్ కేబినెట్ విస్తరణ సందర్భంగా తీసుకున్న నిర్ణయం మరోసారి ఇదే వాదనను తెరపైకి తెస్తోంది. జిల్లా నుంచి మంత్రి పదవి దక్కించుకున్న ఏకైక ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి పేరు చెబితే వైసీపీ నేతలు భగ్గుమంటున్నారు. అయితే ఇలాంటి వారందరినీ ఏకం చేస్తున్నది ఎవరో తెలిస్తే మరో షాక్ తప్పదు.

నెల్లూరు వైసీపీ పాలిటిక్స్
రెడ్డి సామాజిక వర్గ ప్రభావం ఎక్కువగా కనిపించే నెల్లూరు జిల్లాలో గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ భారీ విజయాన్నే సాధించింది. అయితే రెడ్డి సామాజిక వర్గంతో పాటు మరో బీసీ మంత్రికి కూడా జగన్ తన తొలి కేబినెట్లో స్ధానం కల్పించారు. మేకపాటి గౌతంరెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ రూపంలో ఇద్దరు మంత్రులు జగన్ తొలి కేబినెట్ లో చోటు దక్కించుకున్నారు. అయితే మేకపాటి సౌమ్యుడిగా పేరుతెచ్చుకుని కేబినెట్ ప్రక్షాళనలోపే హఠాన్మరణం పాలవ్వగా... మరో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాత్రం మొదటి నుంచి ఇక్కడి రెడ్లకు కంటగింపుగా మారారు. దీంతో అనిల్ వర్సెస్ రెడ్డి రాజకీయం జోరుగా సాగింది.

కాకాణి వర్సెస్ అనిల్ పోరు
నెల్లూరు సిటీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన అనిల్ కుమార్ యాదవ్ కు జగన్ తన తొలి కేబినెట్లో స్ధానం కల్పించారు. దీంతో జిల్లాలో రెడ్ల నుంచి ఆయనకు సహకారం లభించలేదు. ముఖ్యంగా జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న కాకాణి గోవర్ధన్ రెడ్డి నుంచి సహకారం లభించలేదు. అనిల్ మంత్రిగా ఉండగా వీరిద్దరూ ఎన్నడూ పోట్లాడుకోలేదు కానీ ముభావంగా ఉండేవారు. వీరి పోరు అంతర్గంతగానే సాగింది. అనిల్ కు వ్యతిరేకంగా కాకాణి వ్యూహాత్మకంగా జిల్లా నేతల్ని ఏకం చేశారు. చివరికి అనిల్ మంత్రి పదవి కోల్పోయారు. కాకాణి మంత్రి అయ్యారు. దీంతో ఈ పోరుకు టర్నింగ్ పాయింట్ లభించింది.

కాకాణికి మంత్రి పదవితో టర్నింగ్
తాజాగా జగన్ కేబినెట్ ప్రక్షాళనలో జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చారు. నెల్లూరు సిటీ నుంచి గెలిచిన అనిల్ కుమార్ యాదవ్ ను కొనసాగించలేదు. దీంతో అప్పటి వరకూ అనిల్ కు వ్యతిరేకంగా పోరు సలిపిన కాకాణి తన స్ధానాన్ని ఆయనకు అప్పగించినట్లయింది. ఇప్పుడు కాకాణికి వ్యతిరేకంగా అనిల్ పోరు ప్రారంభించారు. కాకాణి మంత్రి పదవి ప్రమాణస్వీకారానికి ఆహ్వానం అందలేదని బహిరంగంగానే చెప్పేసిన అనిల్.. ఆయన తనకు అందించిన సహకారానికి డబుల్ సహకారం అందిస్తానంటూ సెటైర్లు వేశారు. ఇప్పుడు అనుకున్నట్లుగానే పని మొదలుపెట్టేశారు.

కాకాణి ప్రత్యర్ధుల్ని ఏకం చేస్తున్న అనిల్
నెల్లూరు జిల్లాలో కాకాణి గోవర్ధన్ రెడ్డికి అనుచరులు ఎంతమంది ఉన్నారో ప్రత్యర్ధులు కూడా అంతేమంది ఉన్నారు. ముఖ్యంగా బీసీలతో పాటు రెడ్లలోనూ కాకాణికి ప్రత్యర్ధులున్నారు. వీరందరినీ ఇప్పుడు ఏకం చేసే పనిలో తాజా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఏకం చేసే పనిలో బిజీగా ఉన్నారు. ముందుగా కాకాణి బావ, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని ఇవాళ అనిల్ యాదవ్ కలిశారు. ఇదే క్రమంలో జిల్లాలోని కాకాణి ప్రత్యర్ధులందరినీ ఆయన కలిసేందుకు ప్లాన్ చేసుకున్నారు. ముఖ్యంగా జిల్లాలో మంత్రి పదవి ఆశించి భంగపడిన వారందరినీ ముందుగా ఏకం చేసేందుకు అనిల్ పావులు కదుపుతున్నారు. ఆ తర్వాత మిగతా నేతల్ని ఏకం చేయడం ద్వారా కాకాణిపై పోరు ముమ్మరం చేయబోతున్నారు. మరి దీన్ని అడ్డుకునేందుకు మంత్రి కాకాణి ఏం చేయబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. మంత్రి పదవి చేపట్టిన తర్వాత తొలిసారి ఈ నెల 17న జిల్లాకు వస్తున్న కాకాణికి నెల్లూరు సిటీలో భారీగా స్వాగత ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే అదే్ రోజు కార్యకర్తలతో పోటీగా భారీ సభ ఏర్పాటు చేసేందుకు అనిల్ సిద్ధమవుతున్నారు. దీంతో విరిద్దరి వ్యవహారం జిల్లాలో చర్చనీయాంశమవుతోంది.












Click it and Unblock the Notifications