తారాస్థాయికి వైసీపీలో వర్గపోరు: మంత్రి ముందే ఆ నేతపై చెప్పుతో దాడి
ఏపీ లోని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు రోడ్డెక్కాయి .తూర్పుగోదావరి జిల్లాలో అధికార వైసీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. వైసీపీలో గతంలో ఉన్న నాయకులకు ,ఇటీవల ఎన్నికల తర్వాత రాజకీయ పరిణామాల్లో భాగంగా వైసిపిలో చేరిన టిడిపి నేతలకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఇక ఈ అంతర్గత కొట్లాట బహిరంగంగా దాడులు చేసుకునే వరకు వెళ్లిందంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
వైసీపీ మంత్రి , వైవీ ల ముందే తోటపై చెప్పుతో దాడి యత్నం
తాజాగా ద్రాక్షారామం భీమేశ్వరాలయానికి మంత్రి మోపిదేవి వెంకటరమణ, టీటీడీ చైర్మన్ వై.వి సుబ్బారెడ్డి లతోపాటు ఇటీవల వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే అమలాపురం పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు తోట త్రిమూర్తులు కూడా వెళ్లారు. ఇక ఈ సమయంలో చోటు చేసుకున్న ఘటన ఇప్పుడు వైసీపీ వర్గాల్లో చర్చనీయాంశం అవుతుంది. ఇక దీని తర్వాత తోట త్రిమూర్తులు వర్గం వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరడానికి సభను ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఆ సభకు వెళ్తున్న క్రమంలో తోట త్రిమూర్తులు పై చెప్పుతో దాడికి యత్నించాడు ఒక వ్యక్తి.
స్థానిక ఎమ్మెల్యే వేణు వర్గానికి చెందిన ఇజ్రాయెల్ త్రిమూర్తులుపై దాడి
స్థానిక ఎమ్మెల్యే వేణు వర్గానికి చెందిన ఇజ్రాయెల్ అనే వ్యక్తి చెప్పుతో త్రిమూర్తులు పై దాడి చేశాడు. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు, కార్యకర్తలు అతడిని అక్కడి నుండి పక్కకు నెట్టేశారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరోవైపు అక్కడే ఉన్న మంత్రి మోపిదేవి వెంకటరమణ జరిగిన ఘటన పట్ల ఖిన్నుడైన తోట త్రిమూర్తులను సముదాయించారు.
తోటపై దాడి చేసిన తనకు దళితుల మద్దతు కావాలన్న ఇజ్రాయెల్
అయితే ఈ ఘటనతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లో మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులుకు, తాజా ఎమ్మెల్యే వేణుకు మధ్య అసలే పొసగడం లేదనేది తెలుస్తుంది. అయితే ఆ తరువాత తోట త్రిమూర్తులుపై తాను చెప్పుతో దాడి చేశానని, అతడికి వ్యతిరేకంగా చేస్తున్న పోరాటానికి దళితులందరూ మద్దతు ఇవ్వాలని ఇజ్రాయెల్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్లు ఇప్పుడు వైరల్గా మారాయి.
తారాస్థాయికి తూర్పు గోదావరి జిల్లాలో వైసీపీ వర్గ పోరు
తోట త్రిమూర్తులు పై దళితుల శిరోముండనం కేసు ఉన్న నేపథ్యంలో ఆగ్రహంతో ఇజ్రాయెల్ దాడి చేశారని కొందరు చెబుతుండగా, వేణు వర్గానికి, తోట త్రిమూర్తులు వర్గానికి మధ్య గొడవ తోట త్రిమూర్తులుపై దాడికి కారణమైందని కొందరు భావిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ తాజా పరిణామాల నేపథ్యంలో వైసీపీ లో వర్గ పోరు తారాస్థాయికి చేరుకుందని ,తూర్పుగోదావరి జిల్లాలో పాత, కొత్త నేతలు తన్నుకు చస్తున్నారు అని అర్థమవుతుంది.