ఏపీపై తీవ్ర ప్రభావం చూపిస్తున్న ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం.. నష్టాల్లో ఆ రైతులు!
పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆక్వా రంగాన్ని ప్రభావితం చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాగయ్యే రొయ్యలు విదేశాలకు ఎగుమతి అవుతాయి. యుద్ధ ప్రభావంతో అంతర్జాతీయ ఎగుమతులు నిలిచిపోవడంతో ఏపీలోని ఆక్వా రంగం తీవ్ర ప్రభావాన్ని ఎదుర్కొంటోంది. ముఖ్యంగా రొయ్యల సాగుదారులను ప్రస్తుత యుద్ద పరిస్థితులు తీవ్ర సంక్షోభంలోకి నెట్టాయి.
అంతర్జాతీయ ఎగుమతులు నిలిచిపోవడంతో రొయ్యల ధరలు పతనం
గత సంవత్సరం అమెరికా విధించిన సుంకాల నుండి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆక్వా రైతులకు ప్రస్తుతం ఇరాన్ ఇజ్రాయిల్ మధ్య కొనసాగుతున్న యుద్ధం మరో భారీ దెబ్బగా మారింది. ఏపీలోని గోదావరి జిల్లాలలో రొయ్యల సాగు లక్షల ఎకరాలలో జరుగుతుంది. ఇక్కడ నుండి అంతర్జాతీయంగా రొయ్యల ఎగుమతులు జరుగుతాయి. పశ్చిమగోదావరి జిల్లాలో దాదాపు రెండు లక్షల ఎకరాలలో రొయ్యల సాగు జరుగుతుండగా, అంతర్జాతీయ ఎగుమతులు నిలిచిపోవడంతో ధరలు అమాంతం పడిపోయాయి.

యుద్ధంతో కేజీకి 30 రూపాయల నుండి 40 రూపాయల వరకు తగ్గిన రొయ్యల ధర
దీంతో రొయ్యలను సాగు చేస్తున్న రైతులు తీవ్ర నష్టాలను చూడాల్సి వస్తుంది. గత నాలుగైదు రోజులుగా రొయ్యల ధరలు కేజీకి 30 రూపాయల నుండి 40 రూపాయల వరకు పతనం కాగా రైతులకు ఒక్కొక్క టన్నుకు సుమారు 40 వేల రూపాయల వరకు నష్టం వాటిల్లుతోంది.
బాగా తగ్గిన రొయ్యల ధరలతో రైతుల ఆవేదన
ముఖ్యంగా 30 కౌంట్ రొయ్యల ధర 510 నుండి 470 లకు, 40 కౌంట్ రొయ్యల ధర 410 రూపాయల నుండి 360 రూపాయలకు పడిపోవడం రొయ్యల సాగు దారులను తీవ్రంగా దెబ్బతీస్తుంది. ఒకవైపు మార్కెట్లో ధరలు తగ్గుతుంటే మరోవైపు సాగు ఖర్చులు విపరీతంగా పెరగడం రైతులకు ఇబ్బందికరంగా మారింది. మార్కెట్లో ఏర్పడే అనిశ్చితుల ప్రభావం కూడా ఆక్వా రంగంపై పడుతుందన్న ఆవేదన వ్యక్తం అవుతుంది.
ప్రభుత్వ చర్యలకు ఆక్వా రైతుల డిమాండ్
ప్రాసెసింగ్ యూనిట్లు, ఏజెంట్లు, సిండికేట్ గా మారి యుద్ధం పేరుతో కావాలని ధరలు తగ్గిస్తున్నారు అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ప్రాసెసింగ్ యూనిట్ల యాజమాన్యాలతో చర్చలు జరిపి రైతులకు కనీస మద్దతు ధర కల్పించాలని ఆక్వా రైతులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించకుంటే తమకు ఆత్మహత్యలే శరణ్యమని వారు వాపోతున్నారు.












Click it and Unblock the Notifications