ఇళ్ల నిర్మాణాల్లో రాష్ట్ర ప్రభుత్వం అక్రమాలు...పచ్చ చొక్కాలకే గృహాలు...ఇదేనా 40 ఏళ్ల అనుభవం:జీవీఎల్
విజయవాడ:బిజెపి జాతీయ అధికార ప్రతినిధి జి.వి.ఎల్ నరసింహరావు మరోసారి ఎపిలోని టిడిపి ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనా తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం క్రింద నిర్మించే ఇళ్ల విషయంలో టిడిపి ప్రభుత్వం అక్రమాలకు పాల్పడుతోందని జి.వి.ఎల్ నరసింహరావు ఆరోపించారు. చదరపు అడుగు నిర్మాణానికి రూ.2,400 చొప్పున బిల్లులు వేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. దేశ రాజధాని దిల్లీ, రాష్ట్ర రాజధాని విజయవాడలో కూడా అంత ఖర్చు కాదన్నారు. కేవలం పచ్చ చొక్కాల వారికే ఇళ్లు కేటాయిస్తున్నారని...పేదలు అడిగితే వారి నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని జివిఎల్ విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం 7 లక్షలకు పైగా గృహాలు కేటాయిస్తే ఇప్పటి వరకూ 43వేలు మాత్రమే పూర్తి చేశారని ఆయన ధ్వజమెత్తారు. నంబర్వన్ పరిపాలన, 40ఏళ్ల అనుభవం ఉన్న వారి పరిపాలన అంటే ఇలాగే ఉంటుందా?...అని జివిఎల్ ఎద్దేవా చేశారు. 2022కల్లా దేశంలోని పేదలందరికీ ఇళ్లు నిర్మించాలనే లక్ష్యంతో నరేంద్రమోదీ ఈ పథకానికి రూపకల్పన చేస్తే... ఆ ఆశయానికి తూట్లు పొడిచేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంకు సంబంధించి ఒక్క రూపాయికి సంబంధించిన బిల్లు కూడా కేంద్రం వద్ద పెండింగ్లో లేదన్నారు. కడపలో ఉక్కు కర్మాగారానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వమే మోకాలడ్డుతోందని, పైగా ఆ విషయం బైటపడకుండా నాటకాలు ఆడుతోందని జివిఎల్ ఆరోపించారు.