కొత్త ట్విస్ట్: అఖిలప్రియ వారిని నమ్మడం లేదా, శిల్పాకు చిక్కులు?
టిడిపి ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణి రెడ్డిపై మంత్రి భూమా అఖిలప్రియ పూర్తి నమ్మకంగా లేరా? నంద్యాల ఉప ఎన్నికల్లో తమకు పూర్తిగా మద్దతిస్తారని ఆమె భావించడం లేదా? అంటే కావొచ్చుననే వాదనలు వినిపిస్తున్నాయి.
నంద్యాల: టిడిపి ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణి రెడ్డిపై మంత్రి భూమా అఖిలప్రియ పూర్తి నమ్మకంగా లేరా? నంద్యాల ఉప ఎన్నికల్లో తమకు పూర్తిగా మద్దతిస్తారని ఆమె భావించడం లేదా? అంటే కావొచ్చుననే వాదనలు వినిపిస్తున్నాయి.
చదవండి: ఆ అస్త్రంతో.. అఖిల వ్యూహాలు!, ఇద్దరి భవిష్యత్తుపై..
శిల్పా సోదరుల్లో ఒకరైన చక్రపాణి రెడ్డి కొద్ది రోజుల క్రితం జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందారు. టిడిపి నుంచి పోటీ చేసిన ఆయనకు భూమా వర్గం కూడా మద్దతు పలికింది. అప్పటికి చక్రపాణి రెడ్డి సోదరుడు శిల్పా మోహన్ రెడ్డి టిడిపిలోనే ఉన్నారు.
శిల్పా చక్రపాణి రెడ్డి మద్దతిస్తారా?
నంద్యాల ఉప ఎన్నిక టిక్కెట్ టిడిపి నుంచి తనకు దక్కక పోవడంతో శిల్పా మోహన్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలో చక్రపాణి రెడ్డి తన సోదరుడు మోహన్ రెడ్డికి పరోక్షంగా మద్దతు ఇవ్వడం లేదా టిడిపి అభ్యర్థి భూమా బ్రహ్మానంద రెడ్డికి సహకరించకపోవచ్చునని భూమా వర్గం భావిస్తోందని ప్రచారం సాగుతోంది. అఖిలప్రియ, బ్రహ్మానంద రెడ్డి కూడా ఇదే అభిప్రాయంతో ఉండవచ్చునని అంటున్నారు.
సమాచారం ఇవ్వడం లేదా?
చక్రపాణి రెడ్డి మద్దతు పూర్తిస్థాయిలో ఉండదనే ఉద్దేశ్యంతో భూమా వర్గం కూడా ఉప ఎన్నికల కార్యక్రమానికి గురించి ఆయనకు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదని అంటున్నారు. దీనిపై అసంతృప్తితో ఉన్న చక్రపాణి రెడ్డి కూడా జిల్లా ఇంచార్జి మంత్రులు, సీనియర్ నేతలకు సమాచారం ఇచ్చారని తెలుస్తోంది. దీంతో కలుపుకొని వెళ్లాలని భూమా వర్గానికి కూడా నేతలు చెప్పారని తెలుస్తోంది.
వైసిపిలోనూ..
శిల్పా మోహన్ రెడ్డి వైసిపి నుంచి పోటీ చేస్తున్నారు. టిడిపి నుంచి భూమా బ్రహ్మానంద రెడ్డి బరిలో ఉన్నారు. వైసిపి నేత కాటసాని రాంరెడ్డి భూమాకు బంధువు. ఈ నేపథ్యంలో వైసిపిలోను ఆయన మద్దతు శిల్పాకు ఉండదనే ప్రచారం మొదటి నుంచి సాగింది. అయితే, ఆయా నేతలు మాత్రం పార్టీ ప్రకటించిన అభ్యర్థికి మద్దతిస్తామని మొదటి నుంచి చెబుతున్నారు.
గెలుపుపై ఇరువురి ధీమా
నంద్యాల ఉప ఎన్నికల్లో గెలుపుపై టిడిపి, వైసిపిలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. నోటిఫికేషన్ విడుదలయ్యాక ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు రంగంలోకి దిగవచ్చు. పోటీ మాత్రం శిల్పా, భూమా బ్రహ్మానంద రెడ్డిల మధ్యే ఉండనుంది. ఈ ఎన్నికల్లో గెలిచేందుకు ఇరు పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి.