ముద్రగడ దీక్ష: చంద్రబాబు ప్లాన్ ఏంటీ?, ప్రభుత్వం దారి తప్పుతోందా?
అమరావతి: ముద్రగడ పద్మనాభం... ఇటీవల కాలంలో ఈ పేరు ఏపీలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. కాపులను బీసీల్లో చేర్చాలనే డిమాండ్తో ఆయన చేపట్టిన కాపు ఉద్యమం కాస్త తునిలో విధ్యంసానికి కారణమై రైలు దహనం వరకు వెళ్లింది. ఈ క్రమంలో తుని విధ్వంసానికి కారణమైన పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
దీంతో అరెస్ట్ చేసిన వారిని విడిచిపెట్టాలంటూ ముద్రగడ దీక్ష చేపట్టి ఇప్పటికి ఆరు రోజులైంది. తొలుత ముద్రగడ దీక్షపై ప్రజల్లో వ్యతిరేకత, ప్రభుత్వం పట్ల సానుకూలత కనిపించాయి. ఎందుకంటే ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడంతో పాటు రైలుని దహనం చేసిన వారిని అరెస్ట్ చేయకుండా ఉంటారా? అనే కారణం చేత.
ఈ క్రమంలో దీక్షకు దిగిన ముద్రగడతో పాటు కుటుంబ సభ్యులను రాజమండ్రి ఆసుపత్రికి తరలించారు. ఆయన ఆరోగ్యం నీరసంగా ఉన్న ప్లూయిడ్స్ ఎక్కించుకునేందుకు ససేమేరా అంటున్నారు. అయితే ఆయన దీక్ష పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరించడం, మరీ శృతిమించిన ప్రభుత్వ ఓవరాక్షన్ ఉండటంతో అందరూ ఇప్పుడు ప్రభుత్వాన్నే విమర్శిస్తున్నారు.

ముద్రగడ దీక్ష నేపథ్యంలో రాష్ట్రంలోని కాపు నేతలంతా ఒక్కటై హైదరాబాద్లో సమావేశాన్ని ఏర్పాటు చేయడం కూడా ప్రభుత్వానికి మింగుడు పడటం లేదు. మరోవైపు ముద్రగడ ఆరోగ్య పరిస్థితి కాస్త క్షీణించిందని, తక్షణం వైద్యం అందించాలని రాజమండ్రి ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ రమేష్ కిషోర్ వైద్య బృందంతో కలిసి మీడియాకు వెల్లడించారు.
దీక్షను కొనసాగిస్తున్న ముద్రగడ వైద్యానికి నిరాకరిస్తున్నారని తెలిపారు. రక్తపోటు 130/90, పల్స్రేట్ 80గా ఉందని చెప్పారు. ఆయన సతీమణి, కోడలు బాగా నీరసించిపోయారని, ముద్రగడ అనుమతితో వారికి వైద్యం చేస్తున్నామని వైద్యులు తెలిపారు. దీంతో ప్రభుత్వం ఇప్పుడు ఆత్మరక్షణలో పడింది.
ముఖ్యంగా ముద్రగడను కలవడానికి ఎవరినీ అనుమతించడం లేదు. అసలు ఆయన దీక్ష కొనసాగిస్తున్నారా? లేదా అనే విషయం కూడా తెలియకుండా ప్రభుత్వం జాగ్రత్తపడుతోంది. దీంతో ముద్రగడ వ్యవహారంలో ప్రభుత్వం ఇంత సీక్రసీ అవలంభించడం అవసరమా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు.
ప్రభుత్వం తీరు ఇలాగే ఉంటే కాపు జాతి మొత్తం ముద్రగడకు మద్దతు తెలిపినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు. ఇప్పటి వరకు ముద్రగడతో విభేదించిన కాపు నేతలు కూడా ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టి, ఆయన పట్ల సానుభూతిని చూపే అవకాశం లేకపోలేదని అంటున్నారు.
ముద్రగడ వైద్యానికి సహకరించడం లేదు కాబట్టి ఆయన దీక్షని భగ్నం చేయదలచుకోకపోతే ఆ విషయం న్యాయస్థానం దృష్టికి ప్రభుత్వం తీసుకెళ్లాల్సి ఉంది. ఇలా జరగని పక్షంలో ముద్రగడ దీక్షను భగ్నం చేసి ఆసుపత్రి నుంచి విడదల చేసినా రాష్ట్రంలో కాస్తం ఉద్రిక్తతలు తగ్గుముఖం పడతాయిని భావిస్తున్నారు.
కానీ ప్రభుత్వం అటువంటి ప్రయత్నాలు ఏవీ చేయడం లేదు. మరోవైపు తుని విద్వంసానికి కారకులైనవారిని బేషరతుగా విడుదల చేస్తే తప్ప దీక్ష విరమించేది లేదని ముద్రగడ చాలా స్పష్టంగా చెబుతున్నా, అందుకు ప్రభుత్వం అంగీకరించకుండా ఆయన్ని దీక్ష విరమించమని ప్రభుత్వం విజ్ఞప్తి చేయడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు.
అలా కాకుండా ముద్రగడ ఆరోగ్యపరిస్థితి ఇంకా క్షీణించి ఆయన ప్రాణానికి ప్రమాదం ఏర్పడితే పరిస్థితి ఇంకా అదుపు తప్పే ప్రమాదం ఉంది. మరోవైపు ముద్రగడ ఆరోగ్యానికి సంబంధించిన వివరాలను ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్, వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి పూనం మాలకొండయ్య, తూగో జిల్లా కలెక్టర్ ఆరా తీస్తున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications