తుని ఘటనపై షాక్: ముద్రగడ వెనుక.. భూమన చుట్టూ బిగిస్తున్న ఉచ్చు!
విజయవాడ: కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం వెనుక వైసిపి అధినేత జగన్ ఉన్నారని తెలుగుదేశం పార్టీ నేతలు పదేపదే ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముద్రగడ వెనుక ఎవరు ఉన్నారని ఏపీ పోలీసులు కూపీ లాగే ప్రయత్నాలు చేశారని తెలుస్తోంది.
ముద్రగడ పద్మనాభం వెనుక వైసిపి సీనియర్ నేత, తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కీలకపాత్ర పోషించినట్లుగా పోలీసులకు సమాచారం అందిందని తెలుస్తోంది. ముద్రగడ వెనుక భూమననే చక్రం తిప్పారా? అని పోలీసులు పూర్తిగా తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం.
కాపులకు రిజర్వేషన్లను డిమాండ్ చేస్తూ తూర్పు గోదావరి జిల్లా తునిలోని కొబ్బరి తోటల్లో ముద్రగడ ఏర్పాటు చేసిన కాపు ఐక్య గర్జనకు లక్షలాదిగా కాపులు తరలి వచ్చిన విషయం తెలిసిందే. ఇక రోడ్డుపై తేల్చుకుందామన్న ముద్రగడ ఒక్కమాటతో కాపులంతా రోడ్డుపైకి వచ్చారు.
కొందరు.. రోడ్డుపై వెళుతున్న పలు వాహనాలు, రత్నాచల్ ఎక్స్ప్రెస్ పైనా ప్రతాపం చూపించారు. ఈ ఘర్షణలో పెద్ద సంఖ్యలో కేసులు నమోదు చేసిన పోలీసులు... అసలు ఈ విధ్వంసం వెనుక సూత్రధారులుగా ఉన్నవారెవరన్న కోణంలో ఆరా తీయడం ప్రారంభించారు.
ఈ క్రమంలో భూమన కరుణాకర రెడ్డికి సంబంధించి పాత్రపై పోలీసులకు కీలక ఆధారాలు లభ్యమైనట్లు తెలుస్తోందని వార్తలు వస్తున్నాయి. అధికార పక్షం తెలుగుదేశం పార్టీ కూడా ఇదే తరహా ఆరోపణలు చేస్తున్న క్రమంలో భూమన పాత్రకు సంబంధించి మరింత మేర స్పష్టమైన ఆధారాలు సేకరించాలని పోలీసులు భావిస్తున్నారు. అతనికి సిఐడి నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది.