జగన్కు దగ్గరవుతున్న సంకేతాలా?, బాబుకు దెబ్బేనా?: 2019లో బీజేపీ చెలిమి ఎవరితో!..
టీడీపీతో కన్నా జగన్ తో దోస్తీనే పార్టీకి లాభిస్తుందని బీజేపీలోని ఒక వర్గం నేతలు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. టీడీపీతో పొత్తు కొనసాగినన్నాళ్లు రాష్ట్రంలో పార్టీ ఎదగదన్న అభిప్రాయం వీరిలో బలంగా ఉంది.
విజయవాడ: ఏపీ ప్రతిపక్ష అధినేత జగన్ ప్రధాని మోడీతో భేటీ అయినప్పటి నుంచి టీడీపీలో అంతర్గతంగా గుబులు మొదలైంది. టీడీపీ ఎమ్మెల్యేలంతా మూకుమ్మడిగా జగన్పై మాటల యుద్దానికి దిగడంతో.. ఈ విషయం మరింత స్పష్టమైంది. ఒక ఆర్థిక నేరస్తుడికి అపాయింట్మెంట్ ఎలా ఇస్తారంటూ మోడీని కూడా తప్పుపట్టే ప్రయత్నం చేశారు.
జగన్-మోడీ భేటీ తర్వాత ఏపీ రాజకీయాల్లో 2019ఎన్నికల చర్చ అప్పుడే మొదలైపోయింది. మోడీకి జగన్ దగ్గరవుతున్నారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు చేసిన వ్యాఖ్యలు సైతం ఆ ఊహాగానాలకు ఊతమిచ్చేలా మారాయి. ప్రస్తుతం టీడీపీతో పొత్తు కొనసాగుతుందని, 2019లో ఎవరితో పొత్తు పెట్టుకోవాలనే దానిపై ఆలోచిస్తామని చెప్పారు.
కాకతాళీయమా!.. లేక..
వెంకయ్య వ్యాఖ్యలను బట్టి చూస్తే.. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తుపై బీజేపీ పునరాలోచనలో పడినట్లుగానే అనిపిస్తోంది. అంతేకాదు, జగన్ మోడీని కలిసినంత మాత్రానా టీడీపీ నేతలు ఎందుకంతలా తర్జన భర్జన పడుతున్నారని వెంకయ్య వ్యాఖ్యానించడం గమనార్హం. వెంకయ్య నోటివెంట ఈ వ్యాఖ్యలు కాకతాళీయమేనా! లేకపోతే భవిష్యత్తు ప్లాన్ రీత్యానే ఇలాంటి వ్యాఖ్యలు చేశారా? అన్నది ప్రస్తుతం ఆసక్తిని రేకెత్తిస్తోన్న అంశం.
చంద్రబాబును ఇబ్బందుల్లో పడేసేలా!:
చంద్రబాబు అమెరికా టూర్ కొనసాగుతున్న సమయంలోనే.. జగన్-మోడీ మధ్య భేటీ జరిగింది. దీంతో ఇక్కడున్న టీడీపీ నేతలంతా వరుసపెట్టి జగన్ పై విరుచుకుపడ్డారు. అంతేనా!, మోడీపై కూడా ఘాటుగానే విమర్శలు చేశారు. ఒక 420 కి ప్రధాని మోడీ ఎలా అపాయింట్మెంట్ ఇస్తారని టీడీపీ ఎమ్మెల్సీ యలమంచిలి లేవనెత్తిన విమర్శను.. బోండా ఉమా, వర్ల రామయ్య, ఇలా మిగతా నేతలు కూడా కొనసాగించారు.
వరుసపెట్టి మోడీపై కూడా విమర్శలు చేసేసరికి బీజేపీ నేతలు కౌంటర్ ఇవ్వడం మొదలుపెట్టారు. విషయం అధినేత చంద్రబాబుకు తెలియడంతో.. అమెరికా నుంచే ఫోన్ చేసి కాస్త గట్టిగానే మందలించారట. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రంలో కీలక పనులను పూర్తి చేయాలంటే కేంద్రం అండ తప్పనిసరి. ముఖ్యంగా ప్రత్యేక ప్యాకేజీ, పోలవరం నిధులు రావాలంటే కేంద్రంతో సఖ్యతగా మెలగాల్సిందే. అలాంటిది, వెనుకా ముందు ఆలోచించకుండా జగన్ తో పాటు మోడీని కలిపి విమర్శించడంతో ఎక్కడ ఇరుకున పడేస్తారేమోనన్న ఆందోళన సీఎంలో కలిగినట్లు తెలుస్తోంది.
2014పొత్తు కూడా ఎవరు ఊహించనిదే!:
నిజానికి 2014ఎన్నికల్లో బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకుందని ఎవరూ ఊహించలేదు. ఒకప్పుడు మోడీని మతతత్వ వాది అని, గుజరాత్ పీఠం నుంచి ఆయన్ను గద్దె దించాలని చంద్రబాబు గట్టిగానే వాదించారు. అలాంటి చంద్రబాబుతో జత కట్టడానికి మోడీ సిద్దపడుతారని ఎవరూ అనుకోలేదు. కానీ ఎవరూ ఊహించని విధంగా ఈ రెండు పార్టీలు ఎన్నికల్లో పొత్తుతో బరిలోకి దిగాయి.
నిజానికి గత ఎన్నికలకు ముందు గుంటూరు నుంచి బస్సు యాత్ర ప్రారంభించిన సమయంలోను తాను మోడీకి వ్యతిరేకమన్న సంకేతాలు చంద్రబాబు పంపించారు. గుజరాత్ అల్లర్లను గుర్తుచేసి.. ప్రధానిగా ఆయనకు మద్దతునిచ్చేది లేదన్నారు. అటు బీజేపీ కూడా తొలుత వైసీపీతో పొత్తు కోసమే సంప్రదించినట్లు చెబుతారు.
కానీ మోడీతో పొత్తు వల్ల తమ పార్టీకి బలమైన ఓటు బ్యాంకుగా ఉన్న ముస్లిం, క్రిస్టియన్లలో దెబ్బ పడుతుందని జగన్ భావించారు. దానికి తోడు కచ్చితంగా ఎన్నికల్లో గెలిచి తీరుతామన్న ధీమా కూడా బీజేపీకి జగన్ 'నో' చెప్పేలా చేసింది. ఆ తర్వాత వెంకయ్య రాయబారం నెరపడంతో టీడీపీకి బీజేపీ పొత్తు కుదిరింది.
అప్పటికీ పవన్ కళ్యాణ్ జనసేనను నెలకొల్పి టీడీపీకి మద్దతునిస్తున్నందునా.. పవన్ చరిష్మా కూడా కలిసి వస్తుందన్న అభిప్రాయాన్ని బీజేపీ నేతలు అధిష్టానానికి విన్నవించారు. దీంతో టీడీపీతో పొత్తుకు బీజేపీ ఓకె చెప్పింది.
ఈ నేపథ్యంలో 2019ఎన్నికల్లోను జగన్ తో బీజేపీ పొత్తు పెట్టుకునే అంశాన్ని కొట్టిపారేయలేం. దక్షిణాదిలో విస్తరించడానికి ఎప్పటినుంచో తీవ్రంగా ప్రయత్నిస్తున్న బీజేపీ.. జగన్ తో పొత్తు ద్వారా ఏపీలో తన ప్రాబల్యం పెరుగుతుందని భావిస్తే.. కచ్చితంగా ఆ దిశగా నిర్ణయం తీసుకునే అవకాశం లేకపోలేదు.
బీజేపీ చేతిలో ఇద్దరూ పావులే:
ఏపీలో బీజేపీ ఎవరో ఒకరితో కచ్చితంగా పొత్తు పెట్టుకునే తీరుతుంది. సొంతంగా పోటీ చేసే సామర్థ్యం ఆ పార్టీకి లేదు. మరోవైపు బీజేపీతో పొత్తు కోసం అటు జగన్, ఉన్న పొత్తును కాపాడుకోవడం కోసం ఇటు చంద్రబాబు ప్రయత్నిస్తూనే ఉన్నారు. అక్రమాస్తుల కేసులో జగన్, ఓటుకు నోటు కేసులో చంద్రబాబు.. కేంద్రం గుప్పిట్లో బంధీలుగా ఉన్నారు కాబట్టి పొత్తు కోసం తహతహలాడుతున్నారు.
అయితే టీడీపీతో కన్నా జగన్ తో దోస్తీనే పార్టీకి లాభిస్తుందని బీజేపీలోని ఒక వర్గం నేతలు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. టీడీపీతో పొత్తు కొనసాగినన్నాళ్లు రాష్ట్రంలో పార్టీ ఎదగదన్న అభిప్రాయం వీరిలో బలంగా ఉంది. వీళ్లు గనుక మోడీ వద్ద గట్టిగా లాబీయింగ్ చేయగలిగితే జగన్ తో బీజేపీ చెలిమి సాధ్యపడినా ఆశ్చర్యపోనక్కర్లేదు!.