చిరంజీవి ఎఫెక్టేనా?: జాతీయ వీరుడిగా ఉయ్యాలవాడను కేంద్రం గుర్తిస్తుందా!..
ఇదంతా పబ్లిసిటీ స్టంట్ అని కొట్టిపారేసేవారు లేకపోలేదు. చిరంజీవి సినిమాకు ప్రచారం కల్పించుకునేందుకే ఈ కొత్త ప్రచారాన్ని తెర పైకి తీసుకొచ్చారని పలువురు అభిప్రాయపడుతున్నారు.
హైదరాబాద్: రాయలసీమ బిడ్డగా.. తొలి తెలుగు స్వాతంత్య్ర సమరయోధుడిగా బ్రిటీష్ వలస పాలనపై తిరగబడ్డ ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని జాతీయ వీరుడిగా గుర్తించేందుకు కేంద్రం సిద్దమవుతుందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు కేంద్రం కసరత్తులు కూడా ప్రారంభించినట్లు చెబుతున్నారు.
తమిళనాడు తెలుగు యువశక్తి విజ్ఞప్తి మేరకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని జాతీయ వీరుడిగా ప్రకటించే విషయాన్ని కేంద్రం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. యువశక్తి విజ్ఞప్తిని పరిశీలించిన పీఎంవో కార్యాలయం తగిన చర్యలు తీసుకోవాలని సూచిస్తూ కేంద్ర హోంశాఖకు ఉత్తర్వులు పంపినట్లు సమాచారం. తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు జగదీశ్వర్ రెడ్డి ఈ విషయాన్ని తెలిపారు.
ఇదిలా ఉంటే.. రాజ్యసభ సభ్యుడు, మెగాస్టార్ చిరంజీవి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో నటిస్తున్నందువల్లే కేంద్రంలో ఇప్పుడీ కదలిక మొదలైందన్న వాదన వినిపిస్తోంది. చిరంజీవి ఎఫెక్ట్ వల్లే ఉయ్యాలవాడను కేంద్రం చర్యలకు సిద్దమవుతోందంటున్నారు. ఇక మరి కొంతమంది మాత్రం దీనిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఇదంతా పబ్లిసిటీ స్టంట్ అని కొట్టిపారేసేవారు లేకపోలేదు. చిరంజీవి సినిమాకు ప్రచారం కల్పించుకునేందుకే ఈ కొత్త ప్రచారాన్ని తెర పైకి తీసుకొచ్చారని పలువురు అభిప్రాయపడుతున్నారు. చూడాలి మరి ఉయ్యాలవాడని కేంద్రం గుర్తించబోతుందన్న వార్త కేవలం ఇక్కడికే పరిమితమవుతుందో? లేక ముందడుగు పడుతుందో!..