స్టాండ్ బైగానే చంద్రబాబు ? పవన్ దూకుడు ఫెయిలైతే రంగంలోకి ? మోడీ తాజా వ్యూహమిదే !
ఏపీలో వైసీపీకి వ్యతిరేకంగా బీజేపీని రోడ్ మ్యాప్ అడిగిన పవన్ కళ్యాణ్ కు.. ప్రధాని మోడీ ఇచ్చిన కొత్త రోడ్ మ్యాప్ అమల్లోకి వచ్చేసినట్లే కనిపిస్తోంది. విశాఖలో పవన్ తో అరగంట భేటీలో రాబోయేవి మంచి రోజులంటూ చెప్పిన ప్రధాని.. అవి తెచ్చే ప్లాన్ అమలు విషయంలో మాత్రం పక్కాగానే ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పటివరకూ ఏపీలో కనిపిస్తున్న రాజకీయంలో పెను మార్పులు తప్పేలా లేవు. ముఖ్యంగా ప్రధాని విపక్ష నేతగా ఉన్న చంద్రబాబును ఇప్పటికే వైఎస్ జగన్ పక్కనబెట్టేస్తుండగా.. ఇప్పుడు విపక్షంలో ఉన్న బీజేపీ-జనసేన కూటమి సైతం ప్రస్తుతానికి లైట్ తీసుకుంటోంది.
పవన్ కు మోడీ రోడ్ మ్యాప్
ఏపీ రాజకీయాల్లో టర్నింగ్ పాయింట్ గా భావిస్తున్న పవన్-మోడీ వైజాగ్ భేటీ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులకు కారణమవుతోంది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం కేంద్రంగా సాగుతున్న రాజకీయ క్రీడ కాస్తా వైకుంఠపాళిగా మారి అప్పటివరకూ ప్రాధాన్యం కలిగిన నేతలు కాస్తా పక్కకు వెళ్లిపోయి అప్రాధాన్యంగా ఉండే నేతలు లైన్ లోకి వచ్చేస్తున్నారు. దీంతో ఈ రాజకీయ వైకుంఠపాళి ఎప్పుడు ఎవరిని మింగుతుందో తెలియక కింది స్ధాయి నేతలు ఆందోళనలో ఉండాల్సిన పరిస్ధితి. ప్రధాని మోడీ పవన్ కళ్యాణ్ కు ఇచ్చిన రోడ్ మ్యాప్ ప్రకారం చూస్తే ప్రధాన విపక్షంగా ఉన్న టీడీపీ స్ధానంలో జనసేన-బీజేపీ కూటమి వచ్చి చేరాల్సి ఉంది.
చంద్రబాబుపై మోడీ వ్యూహాలు
ఒకప్పుడు తనతో స్నేహం చేసి అధికారం అందుకున్నాక, మూడేళ్ల పాలన తర్వాత వైసీపీ ట్రాప్ లో చిక్కుకుని తనతో విభేధించిన చంద్రబాబు అప్పట్లో ఎలా వ్యవహరించాడో మోడీ మర్చిపోలేదు. దీంతో 2019 తర్వాత ఏకంగా మూడేళ్ల పాటు దూరంగా ఉంచేసిన ప్రధాని.. మారిన పరిస్ధితుల్లో తిరిగి చంద్రబాబును కాస్త చేరదీయడం మొదలుపెట్టారు. అయితే అప్పటివరకూ పూర్తిగా దూరం ఉంచేసిన బీజేపీ పెద్దలు కాస్త కనికరించడంతో అదే మహాభాగ్యం అనుకునే పరిస్ధితుల్లోకి చంద్రబాబు వెళ్లిపోతున్నారు. దీంతో ఇదే అదనుగా ప్రధాని మోడీ.. చంద్రబాబు విషయంలో కొత్త వ్యూహాలు రచిస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ ఎన్నికల కేంద్రంగా ఈ వ్యూహాలు సాగుతున్నాయి.
తెలంగాణ ఎన్నికల పరీక్ష
తెలంగాణలో వచ్చే ఏడాది సెప్టెంబర్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇందులో బీజేపీకి టీడీపీ అవసరమొచ్చింది. ముఖ్యంగా హైదరాబాద్ తో పాటు దక్షిణ తెలంగాణ జిల్లాల్లో టీడీపీకి అండగా ఉండే ఓట్ల సంఖ్య ఇప్పుడు బీజేపీని ఆకర్షిస్తోంది. దీంతో టీడీపీతో పాటు జూనియర్ ఎన్టీఆర్, టీడీపీకి మద్దతుగా ఉండే రామోజీరావు వంటి వారి సాయం కూడా తీసుకునేందుకు బీజేపీ వ్యూహరచన చేస్తోంది. దీంతో తెలంగాణ ఎన్నికలు ఇప్పుడు టీడీపీ సామర్ధ్యానికి కూడా పరీక్ష కాబోతున్నాయి. ఇందులో చంద్రబాబు ఎంత మేరకు బీజేపీ గెలుపుకు కారణమవుతారన్న దానిపై భవిష్యత్ వ్యూహాలు ఆధారపడి ఉండబోతున్నాయి.
చంద్రబాబును స్టాండ్ బైగానే చూస్తున్న బీజేపీ ?
తెలంగాణ ఎన్నికల నాటికి చంద్రబాబుతో పాటు ఆయన పార్టీ మద్దతును బీజేపీ తీసుకోవడం ఖాయం. అయితే ఏపీలో మాత్రం చంద్రబాబు అవసరం లేకుండా చూసుకోవాలనేది మోడీ వ్యూహం. దీంతో ఏపీలో పవన్ సాయంతో బీజేపీని అధికారంలోకి తెచ్చుకునేందుకు మోడీ రోడ్ మ్యాప్ సిద్దం చేశారు. ఓవైపు చంద్రబాబును స్టాండ్ బైగా ఉంచుతూనే మరోవైపు పవన్-బీజేపీ కూటమిని బలోపేతం చేసుకోవడం మోడీ తక్షణ కర్తవ్యంగా కనిపిస్తోంది. దీంతో చంద్రబాబును పూర్తిగా దూరం పెట్టేయకుండా అధికారిక సమావేశాల్లో పాల్గొనే అవకాశం కల్పిస్తున్నారు. గతంలో ఢిల్లీకి వస్తే అపాయింట్ మెంట్ కూడా ఇవ్వకుండా దూరం పెట్టిన మోడీ.. ఇప్పుడు ఆయనకు రమ్మని ఆహ్వానాలు పలుకుతున్నారు. ఇదంతా చూస్తుంటే భవిష్యత్తులో చంద్రబాబును వాడుకోవాలంటే పూర్తిగా దూరం చేసుకోకూడదన్న మోడీ రాజనీతి కనిపిస్తోంది. ప్రస్తుతానికి ఏపీలో తమ మిత్రుడు జగన్ కూ ఇదే కావాలి మరి.