చంద్రబాబు అంటే ఎమ్మెల్యేలకు అప్పుడే భయం పోయిందా? అధినేత ఆదేశాలు బేఖాతర్
అమరావతి: పదవి కోల్పోయిన నాయకుడిని చులకనగా చూస్తారనేది ఓ రాజకీయ సామెత. ఓటు వేసే జనమే కాదు..సొంత పార్టీ నాయకులు కూడా పెద్దగా పట్టించుకోరు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిస్థితి అచ్చం అలాగే తయారైంది. గత అయిదేళ్ల పాటు అధికారంలో కొనసాగిన ఆయన మాజీ అయి పట్టుమని నెలరోజులు కూడా కాలేదు. అప్పుడే ఆయన ఆదేశాలంటే పార్టీకి చెందిన సీనియర్ శాసనసభ్యులెవరూ పెద్దగా చెవికెక్కించుకోవట్లేదనే విషయం స్పష్టమౌతోంది.
ఆనవాయితీని కాదని..
ఇంతకీ అసలు విషయం ఏమిటంటే- సాధారణంగా తెలుగుదేశం శాసన సభ్యులు పార్టీ రంగు పచ్చ చొక్కాలను ధరించి అసెంబ్లీ సమావేశాల తొలిరోజు హాజరవుతుంటారు. టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు హయాం నుంచీ ఇది ఆనవాయితీగా వస్తోంది. తాజాగా బుధవారం ఉదయం ఆరంభమైన అసెంబ్లీ సమావేశాలకు కూడా పచ్చ చొక్కాలను ధరించి, హాజరు కావాలని పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఈ మేరకు ఓ తీర్మానం కూడా చేశారు. శాసన సభ సమావేశాలకు ముందురోజు ఉండవల్లిలోని ప్రజా వేదికలో పార్టీ శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులతో సమావేశాన్ని నిర్వహించారు. ప్రతిపక్ష పార్టీగా శాసన సభలో వ్యవహరించాల్సిన విధానం, అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనితీరును ఎండగట్టే అంశాలపై చర్చించారు. అనంతరం- తొలిరోజు కావడంతో అసెంబ్లీ సమావేశాలకు పచ్చచొక్కాలతో హాజరు కావాలని ఆదేశించారు.
ఇద్దరూ సీనియర్లే..
సమావేశాలకు హాజరైన ఆ పార్టీకి చెందిన 23 మంది సభ్యుల్లో ఇద్దరు కాస్త విభిన్నంగా కనిపించారు. తెల్ల ఖద్దరు చొక్కాను వేసుకుని, మెడలో పార్టీ కండువాను కప్పుకొని కనిపించారు. ఒకరు కరణం బలరామకృష్ణమూర్తి, మరొకరు- పయ్యావుల కేశవ్. వారిద్దరూ సీనియర్లే. కరణం బలరామకృష్ణమూర్తి ప్రకాశం జిల్లా చీరాల నుంచి ఎన్నికయ్యారు. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం నుంచి పయ్యావుల కేశవ్ గెలుపొందారు. వారిద్దరూ సాధారణ దుస్తుల్లో కనిపించడం అసెంబ్లీ లాబీల్లో చర్చనీయాంశమైంది. పార్టీ నియమాలు, నిబంధనలు వారికి తెలియవని అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే- పార్టీ ఆవిర్భావం నుంచీ వారు కొనసాగుతున్నారు.
Recommended Video
ధిక్కార స్వరం..
అధినేత ఆదేశాలను ధిక్కరించడం అప్పుడే మొదలైందా? అనే చర్చ ప్రస్తుతం నడుస్తోంది మీడియా ప్రతినిధుల్లో. ఆ ఇద్దరిలో కరణం బలరామకృష్ణ మూర్తి చాలాకాలం నుంచీ చంద్రబాబు తీసుకునే నిర్ణయాల పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఇదివరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన గొట్టిపాటి రవికుమార్ను టీడీపీలోకి చేర్చుకోవడంపై ఆయన చంద్రబాబుపై ఓ రకంగా యుద్ధమే చేశారు. గొట్టిపాటి రవికుమార్ను తీసుకుని, తన ప్రాధాన్యతను తగ్గించారంటూ బహిరంగంగా అక్కసు వెల్లగక్కారు కరణం బలరామ్.
కరణం బలరామ్లో తగ్గని ఫైర్..
ఇప్పుడు కూడా ఆయన అదే తరహా వైఖరిలో ఉన్నట్లు చెబుతున్నారు. తనలాంటి సీనియర్ల సూచనలు, సలహాలను ఏ మాత్రం పట్టించుకోకుండా చంద్రబాబు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం వల్లే తమ పార్టీ మొన్నటి ఎన్నికల్లో అత్యంత దారుణంగా పరాజయం పాలు కావాల్సి వచ్చిందని ఆయన కొద్దిరోజుల కిందటే వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితుల్లో ఆయన మరోసారి చంద్రబాబు ఆదేశాలను ధిక్కరిస్తూ.. పార్టీ నియమాలను కాదని, వాటికి భిన్నంగా ప్రవర్తించడం అనుమానాలకు తావిస్తోంది.