కాంగ్రెస్ పై తగ్గని జగన్ కోపం.. ! తెరవెనుక బిగ్ స్టోరీ ఇదేనా ?
ఏపీలో ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉంటూ తన తండ్రి వైఎస్సార్ ఆకస్మిక మరణం తర్వాత తనను సీఎం చేయాలని పట్టుబట్టి, ఇందుకోసం ప్రజల్లో మద్దతు సంపాదించేందుకు ఓదార్పు యాత్ర కూడా చేసేందుకు విఫలయత్నం చేసిన వైఎస్ జగన్ లో ఇంకా ఆ కోపం చల్లారినట్లు లేదు. 2019 ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీతో పాటు ఆయన తల్లి సోనియాగాంధీ తనను జైలుకు పంపారన్న కోపం ఉన్నా క్షమించి వదిలేస్తున్నట్లు చెప్పిన జగన్.. సీన్ కట్ చేస్తే ఇవాళ మరోసారి వారిపై ఆగ్రహం వెళ్లగక్కారు.
జాతీయ స్దాయిలో ఓవైపు ఓట్ల చోరీపై మొత్తం విపక్షాన్ని కూటగట్టి అధికార ఎన్డీయేకూ, బీజేపీకీ, ఈసీకి ముచ్చెమటలు పట్టిస్తున్న రాహుల్ గాంధీ విషయంలో వైఎస్ జగన్ ఇవాళ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ ఓట్ల చోరీ పోరాటానికి మద్దతిస్తారా అని ప్రశ్నిస్తే దేశవ్యాప్తంగా ఓట్ల అక్రమాలపై పోరాటం చేస్తున్న ఆయన.. ఏపీ విషయంలో మాత్రం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. అంతే కాదు తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డితో ఆయన హాట్ లైన్లో టచ్ లో ఉన్నట్లు తేల్చేశారు.

వాస్తవానికి గత ఎన్నికల్లో ఏపీలో దారుణంగా ఓడిపోయిన తర్వాత ఢిల్లీలో ధర్నా పెట్టి ఇండియా కూటమి పక్షాల్ని ఆహ్వానించిన జగన్ కాంగ్రెస్ పార్టీని మాత్రం పట్టించుకోలేదు. గతంలో తనను జైలుకు పంపారన్న కోపమో, మరో కారణమో తెలియదు కానీ కాంగ్రెస్ ను మాత్రం ఆహ్వానించలేదు. ఆ తర్వాత ఏపీకి వచ్చిన జగన్.. కాంగ్రెస్ తన ధర్నాకు మద్దతివ్వకపోవడాన్ని తప్పుబట్టారు. ఆ తర్వాత కాంగ్రెస్ గురించి ఎప్పుడూ మాట్లాడలేదు. కానీ ఇప్పుడు రాహుల్ గాంధీ ఓట్ల చోరీ ఆరోపణల తర్వాత ఏపీలోనూ అలాంటి ఆరోపణలు చేస్తున్న జగన్ ఆయనకు ఎందుకు మద్దతివ్వలేదంటే తన ప్రత్యర్ధులతో టచ్ లో ఉన్నారనే సాకు చెప్పారు.

అయితే రాహుల్ తో పాటు కాంగ్రెస్ పార్టీ విషయంలో వైఎస్ జగన్ ఆగ్రహం వెనుక పలు కారణాలు కనిపిస్తున్నాయి. తక్షణ కారణం చూస్తే వివిధ రాష్ట్రాల్లో ఓట్ల చోరీ విషయంలో ఆధారాలతో ఆరోపణలు చేస్తున్న రాహుల్.. ఏపీ విషయంలో మాత్రం చూసీ చూడనట్లుగా ఉన్నారు. అలాగే ఢిల్లీలో తాను గతంలో ధర్నా చేస్తే కనీస మద్దతు ప్రకటన కూడా చేయలేదు. అలాగే ఎన్డీయేకు ప్రత్యక్ష మిత్రుడైన చంద్రబాబు, పరోక్షంగా సానుకూలంగా కనిపిస్తున్న రేవంత్ రెడ్డి విషయంలో రాహుల గాంధీ సాఫ్ట్ కార్నర్ తో ఉన్నారన్న భావన జగన్ లో కనిపిస్తోంది. అందుకే ఈ ముగ్గురూ టచ్ లో ఉండే తనను టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. అంతే కాదు గురుశిష్యులైన రేవంత్, చంద్రబాబు .. రాహుల్ తో టచ్ లో ఉన్నారని చెప్పడం ద్వారా బీజేపీకి బాబును దూరం చేసేందుకు జగన్ ప్రయత్నిస్తున్నట్లు అర్థమవుతోంది. మరి జగన్ ఆరోపణల్ని బీజేపీ నేతలు పట్టించుకుంటారా లేదా అనేది చూడాల్సి ఉంది.












Click it and Unblock the Notifications