చిక్కుల్లో యనమల, బాబుపై పైచేయి సాధించారా?: జగన్ ప్లస్, మైనస్!
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎట్టకేలకు చంద్రబాబు ప్రభుత్వంపై పైచేయి సాధించారా? అనే చర్చ సాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల వరకు టిడిపితో పోలిస్తే వైసిపి తేలిపోయేదనే వాదనలు వినిపించాయి.
అయితే, ఈసారి జగన్లో పరిణితి, స్పష్టత కనిపించిందని అంటున్నారు. గతంలో కంటే జగన్ ఈసారి సభలో చాలా మెరుగ్గా కనిపించారని అంటున్నారు. అయితే, పైచేయి సాధించే సమయంలోనే చిన్నచిన్న పొరపాటు వల్ల దానిని నిలబెట్టుకోలేకపోయారని అంటున్నారు.
రాజధాని భూములపై మంత్రులపై సభలో విమర్శలు చేయడం, రెండు రోజుల క్రితం అవిశ్వాస చర్చ సందర్భంగా సభలో వ్యవస్థలను చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేయగలరని చెప్పడం వంటి వ్యాఖ్యలతో... జగన్ కొంత చిక్కుల్లో పడ్డారని అంటున్నారు.
అయితే, తాజాగా గురువారం నాడు పార్టీ ఎమ్మెల్యే, నటి రోజాకు హైకోర్టులో అనుకూలంగా తీర్పు రావడం జగన్కు చాలా లబ్ధి చేకూర్చుందని అంటున్నారు. హైకోర్టు తన మధ్యంతర తీర్పు సందర్భంగా.. సభలో రోజా తీరును తప్పుపట్టింది. అయితే, ఏడాది సస్పెన్షన్ సరికాదని, ఓ సెషన్కే పరిమితమని చెప్పింది.
ఏది ఏమైనా రోజా సస్పెన్షన్ విషయం వైసిపికి పెద్ద ప్లస్. నిన్నటి వరకు జగన్ పైచేయి సాధించినట్లు కనిపించినా, ఆ తర్వాత తన పొరపాట్ల కారణంగా వెనుకబడిపోయారని, తద్వారా ప్రభుత్వం పైచేయి సాధించిందని, కానీ ఇప్పుడు రోజాపై తీర్పు ద్వారా.. అధికార పార్టీ చిక్కుల్లోకి నెట్టారనే వాదనలు వినిపిస్తున్నాయి.
ఈ తీర్పు నేపథ్యంలో వైసిపి నేతలు ప్రధానంగా మంత్రి యనమల రామకృష్ణుడిని టార్గెట్ చేశారు. రూల్ 340 (2) ప్రకారం ఒక సెషన్కే చర్యలు తీసుకోవాలని, కానీ ఏడాది పాటు సస్పెండ్ చేయడం ద్వారా రోజా పైన కక్ష సాధింపు ధోరణి కనిపిస్తోందని వైసిపి సభ్యులు చెబుతున్నారు.
ప్రభుత్వం పైన అవిశ్వాసం, స్పీకర్ పైన అవిశ్వాసం పెట్టినప్పటికీ వాటిలో జగన్ తేలిపోయారు. కనీసం ఆయన పెట్టిన ఉద్దేశ్యం లక్ష్యం కూడా నెరవేరలేదు. ఇలాంటి పరిస్థితుల్లో రోజా సస్పెన్షన్ తీర్పు వైసిపికి అతిపెద్ద ఊరట అని చెప్పవచ్చు. మంత్రి యనమల రామకృష్ణుడు రాజీనామాకు వైసిపి డిమాండ్ చేసే అవకాశాలు కూడా లేకపోలేదంటున్నారు.

జగన్లో మైనస్, ప్లస్!
అవిశ్వాసం నోటీసులో జగన్ సంతకం లేకపోవడం ఆయన అనుభవరాహిత్యానికి నిదర్శనం అనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని టిడిపి పదేపదే ప్రశ్నించింది.

జగన్లో మైనస్, ప్లస్!
అవిశ్వాసం సమయంలో డివిజన్ ఓటింగుకు సకాలంలో అడగడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అలాగే ఎంతసేపూ జగన్ మాట్లాడారే తప్ప తన పార్టీ నుంచి ఇతరులను ఎక్కువగా మాట్లాడించేందుకు జగన్ ఆసక్తి చూపించలేదని అంటున్నారు.

జగన్లో మైనస్, ప్లస్!
కోటంరెడ్డి వంటి పలువురుకి అవకాశం వచ్చింది. వారు బాగా మాట్లాడారు. అధికార పార్టీ చేసిన విమర్శలను సమర్థవంతంగా వైసిపి తిప్పికొట్టలేకపోయిందనే వాదనలు వినిపిస్తున్నాయి.

జగన్లో మైనస్, ప్లస్!
జగన్ గతంలో కంటే చాలా మెరుగ్గా మాట్లాడారని, ప్రభుత్వ వైఫల్యాలను బాగా ఎండగట్టారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. తన పైనటిడిపి చేస్తున్న ఆరోపణలకు ధీటుగా స్పందించారు. సవాల్ చేశారు. తద్వారా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టారు.

జగన్లో మైనస్, ప్లస్!
మాట్లాడుతూ.. కొన్ని సందర్భాల్లో నోరు జారిన జగన్.. చాలా సందర్భాల్లో అధికార పక్షం రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా సంయమనం పాటించారు. అమరావతి భూములపై సిబిఐ విచారణకు పట్టుబట్టారు.

రోజా సస్పెన్షన్
వైసిపి ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ విషయంలో హైకోర్టు మధ్యంతర తీర్పు నేపథ్యంలో.. రేపటి నుంచి ప్రభుత్వాన్ని మరింత ఇరకాటంలో పడేసేందుకు వైసిపి ముందుకు పోతోంది. యనమల రాజీనామాకు డిమాండ్ చేయవచ్చు. అయితే, ప్రభుత్వం రోజా సస్పెన్షన్ తీర్పు పైన పైకోర్టుకు వెళ్లనుంది. కాగా, రోజా అంశంపై ప్రివిలేజ్ కమిటీ ఈ నెల 21న భేటీ కానుంది.












Click it and Unblock the Notifications