అర్థమవుతోందా?? 'TDP'పై ED దాడులు?
ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కు తెలుగుదేశం పార్టీ మరోసారి టార్గెట్ గా మారిందా? అనే సందేహాన్ని రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. గత ఎన్నికల సమయంలో టీడీపీ మద్దతుదారులు, పార్టీకి ఫండ్ సమకూర్చే వ్యాపారవేత్తలు లక్ష్యంగా ఈడీ దాడులు చేసిన సంగతి తెలిసిందే. దాంతో ఆర్థిక దిగ్బంధనానికి గురైన టీడీపీ నిధులు సకాలంలో అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. ఏడాదిన్నర సమయంలో ఎన్నికలున్నాయనగా మరోసారి ఈడీకి టీడీపీ టార్గెట్ గా మారిందనే వ్యాఖ్యలు వినవస్తున్నాయి. ఈడీ వరుసగా జరిపిన మూడు దాడులు టీడీపీ అనుకూలురే కావడం విశేషం. అయితే ఇవన్నీ రాజకీయంగా జరుగుతున్న దాడులని చెప్పడానికి అవకాశం లేదు. కాకపోతే జరుగుతున్న పరిణామాలు, దాడులకు గురవుతున్నవారు తెలుగుదేశం పార్టీ అనుకూలురు కావడమే ఇక్కడ విశేషం.

జేసీ ప్రభాకర్ రెడ్డి రూ.22 కోట్లు జప్తు
ఏ పార్టీకైనా అనుకూలంగా ఉండే పారిశ్రామికవేత్తలు ఉంటారు. ఎన్నికల సమయంలో వీరు పార్టీకి నిధులు సమకూర్చుతారు. ఈసారి ఎన్నికలకు కూడా తెలుగుదేశం పార్టీ ఆర్థిక మూలాలను దెబ్బతీసే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ వార్తలు వస్తున్నాయి. జేసీ ప్రభాకర్ రెడ్డికి చెందిన రూ.22 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. పెనుకొండలోని తెలుగుదేశం పార్టీ నాయకురాలు సవిత ఇంట్లో సీబీఐ అధికారులు దాడులు నిర్వహించి కీలకమైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. సవిత భర్త రైల్వే కాంట్రాక్టర్.

కొవిడ్ సమయంలో ఫీజుల లెక్కలపై..
మంగళగిరి ఎన్నారై ఆసుపత్రి, విజయవాడ అక్కినేని మహిళా ఆసుపత్రిలోను ఐటీ, ఈడీ అధికారులు దాడులు నిర్వహించారు. రెండురోజులపాటు నిర్వహించిన సోదాల్లో అధికారులు కీలకమైన సమాచారాన్ని సేకరించినట్లు తెలుస్తోంది. ఈ రెండు ఆసుపత్రులు తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులవే కావడం విశేషం. రూ.43 కోట్లు పక్కదారి పట్టినట్లు సమాచారం రావడంతో దాడులు జరిగాయి. కొవిడ్ సమయంలో వసూలు చేసిన ఫీజులకు లెక్కలు చూపించకపోవడం, అలాగే అక్కినేని ఆసుపత్రిలో అదనపు భవనం నిర్మాణం కోసం వసూలుచేసిన సొమ్మును హైదరాబాద్ లోని రియల్ ఎస్టేట్ కంపెనీలకు డైవర్ట్ చేశారు.

జీఎస్టీ చెల్లించలేదని..
తాజాగా స్కిల్ డెవలెప్మెంట్ కార్పొరేషన్ లో జరిగిన అవకతవకలకు ఈడీ 26 మందికి నోటీసులు జారీ చేసింది. మాజీ ఐఏఎస్ లక్ష్మీనారాయణ, మాజీ ఎండీ గంటా సుబ్బారావులతో పాటు పలువురు నోటీసులు అందుకున్నారు. ఐటీశాఖకు నారా లోకేష్ మంత్రిగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ లో ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో స్పష్టం చేశారు. చంద్రబాబు హయాంలో స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఏర్పాటైంది. రూ.370 కోట్ల చెల్లింపులకు సంబంధించి gst చెల్లించలేదని, అనేక అవకతవకలు జరిగాయని ఈడీ అనుమానిస్తోంది. కాకతాళీయంగా కావచ్చు.. రాజకీయంగా కావచ్చు.. కానీ వరుసగా ఏపీలో ఈడీ దాడులన్నీ టీడీపీ అనుకూలురుపైనే జరుగుతుండటం గమనార్హం.












Click it and Unblock the Notifications