చంద్రబాబు వర్సెస్ లోకేష్: 2019 రథ సారథిపై రెండుగా చీలిన టీడీపీ!
విజయవాడ: తెలుగుదేశం పార్టీకి గుంటూరు, కృష్ణా జిల్లాలతోపాటు ఉత్తర కోస్తా జిల్లాలు కూడా కీలకమే. అలాగే టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబునాయడు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ కూడా. అయితే,
నారా లోకేష్కు రాజధాని ప్రాంత నేతలు అండగా నిలుస్తుండగా, ఉత్తరకోస్తా టీడీపీ మాత్రం సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు మద్దతు పలుకుతున్నాయి.
ఈ క్రమంలోనే 2019 ఎన్నికల సమరానికి సారథిగా బాబు ఉంటారా? లేక లోకేష్ తెరపైకి వస్తారా? అనేదానిపై ఇప్పుడు విస్తృతంగా చర్చ జరుగుతోంది. మహానాడులో కూడా ఈ అంశమే ప్రధానంగా ఉంటుందనేది పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.

2019కి లోకేష్
రాజధాని ప్రాంతం(గుంటూరు, కృష్ణా జిల్లాలు)లోని యువ రాజకీయ నేతలను ముందుండి నడిపించడంలో ఇప్పటికే నారా లోకేష్ సఫలీకృతులైనట్లు తెలుస్తోంది. యువ నేతలంతా 2019 ఎన్నికల రథ సారథి నారా లోకేష్ ఉండాలనే నినాదాలను మహానాడులో చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి కొడుకుగానే గాకుండా తన సొంత శక్తి సామర్థ్యాలతో లోకేష్ పార్టీలో కీలకంగా మారారని మద్దతుదారులు చెబుతుండటం గమనార్హం.

మొదటలో తడబడినా..
మంత్రిగా బాధ్యతలో చేపట్టిన కొత్తలో కొంత తడబాటుకు గురై విమర్శలు ఎదుర్కొన్నా.. ఆ తర్వాత తన లోటుపాట్లను తెలుసుకుని ముందుకు సాగుతున్నారు. ప్రజలకు, పార్టీకి అందుబాటులో ఉంటూ తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. అందుకే యువ మంత్రి అయిన నారా లోకేష్ వచ్చే ఎన్నికల సారథిగా ఉండాలని పార్టీ యువ నేతలు కోరుతున్నారు.

పార్టీ, ప్రజలతో..
ఐటీ, పీఆర్అండ్ ఆర్డీ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తున్నారు నారా లోకేష్. రాష్ట్రంలోని ప్రతీ జిల్లాలోని పార్టీ నేతలతోపాటు ప్రజలను కలుసుకుంటున్నారు. ప్రజా సమస్యలపై దృష్టి సారిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తామని చెబుతున్నారు. అంతేగాక, తన బృందానికి ఓ డేటా బ్యాంక్ తయారు చేయాలని కోరారు.

యువ నేతలు లోకేష్తో.. వారేమో బాబుతో..
యువ నాయకుడు నారా లోకేష్ ఆధ్వర్యంలో పార్టీ, ప్రభుత్వం మరింత సమర్థవంతంగా పనిచేస్తుందని గుంటూరు జిల్లాలోకి చెందిన ఓ టీడీపీ నేత తెలిపారు. నారా లోకేష్ తక్కువ సమయంలోనే పార్టీలో కీలక నేతగా మారిపోయారని అన్నారు. ఉత్తరకోస్తా నేతలు పాత సాంప్రదాయాలను పాటించేవారని, వారంతా సీఎం చంద్రబాబుకు సన్నిహితులుగా ఉన్నారని చెప్పారు.

కీలకం కానున్న మహానాడు
ఈ నేపథ్యంలో 2019 ఎన్నికల రథ సారథి ఎవరనేదానిపై తెలుగుదేశం పార్టీలో సందిగ్ఘత నెలకొన్నట్లు సమాచారం. చంద్రబాబునాయుడే ఎన్నికల ప్రచార సారథిగా వ్యవహరించే అవకాశం ఉన్నప్పటికీ.. నారా లోకేష్ కూడా కీలకం కానున్నారు. తెలుగుదేశం పార్టీ భవిష్యత్గా పేర్కొంటున్న నారా లోకేష్నే వచ్చే ఎన్నికల రథ సారథిగా చేస్తే బాగుంటుందని పలువురు పార్టీ యువనేతలు అభిప్రాయాలు వ్యక్తం చేస్తుండటం గమనార్హం. ఈ క్రమంలో నిర్వహించే మహానాడు వేదిక కీలకం కానుంది.












Click it and Unblock the Notifications