రోజా మంత్రిపదవికి అదే మైనస్ గా - వ్యతిరేక వర్గం బలంగా : వైసీపీ ఫైర్ బ్రాండ్ కు ఏమైంది..!!
త్వరలో ఏపీలో మంత్రివర్గ విస్తరణ జరగనుంది. చిత్తూరు నుంచి జిల్లా నుంచి రోజాకు ఖాయమంటూ కొద్ది రోజుల క్రితం ప్రచారం సాగింది. కానీ, ఇప్పుడు సమీకరణాలు మారుతున్నట్లు కనిపిస్తున్నాయి. అనేక అంశాలు తెర మీదకు వస్తున్నాయి. నగరిలో ఎమ్మెల్యే రోజా పట్టు కోల్పోతున్నారా. పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత నగరిలో ఈ మార్పు ఎందుకు వచ్చింది. రోజా పార్టీ కంటే ఇతర అంశాల పైనే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారనే ఆరోపణల్లో నిజమెంత. తాజాగా నగరిలో మరోసారి రోజాకు వ్యతిరేకంగా నిరనసలు కొనసాగుతున్నాయి.

నగరిలో రోజా పట్టు తగ్గుతోందంటూ
నగరిలో 2019 ఎన్నికల్లో రోజా వరుసగా రెండో సారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మంత్రి పదవి ఖాయమని ప్రచారం సాగింది. కానీ దక్కలేదు. నామినేటెడ్ పదవి ఇచ్చినా.. కొద్ది కాలం క్రితం ఆ పదవి మరొకరికి కేటాయించారు. ఇక, రోజా కు నగరిలో సొంత పార్టీలోనే విపక్షం ఎదురైంది. వారిని తన వైపు తిప్పుకోవటంలో రోజా సక్సెస్ కాలేకపోతున్నారు.
జిల్లాకు చెందిన సొంత పార్టీ సీనియర్ నేత మద్దతుతోనే వారంతా రోజాకు వ్యతిరేకంగా పని చేస్తున్నారంటూ ఎమ్మెల్యే మద్దతు దారులు ఆరోపిస్తున్నారు. ఇక, తనను జిల్లా కలెక్టర్ పట్టించుకోవ టం లేదంటూ..ప్రోటోకాల్ అమలు చేయటం లేదంటూ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ ముందు రోజా కన్నీటి పర్యంతమయ్యారు.

రెండో సారి గెలిచిన సమయం నుంచీ
ఇక, డిప్యూటీ సీఎం నారాయణ స్వామి తనకు సమాచారం ఇవ్వకుండా తన నియోజక వర్గంలో పర్యటించటం పైన రోజా ఓపెన్ గానే సీరియస్ అయ్యారు. ఇక, తాజాగా జరిగిన ఎంపీపీ ఎన్నికల్లోనూ తన మాట కాదని..పార్టీలోని ప్రత్యర్ది వర్గం మరొకరికి అవకాశం ఇచ్చే ప్రయత్నం చేయటంతో రోజా అడ్డుకున్నారు. నేరుగా మంత్రి పెద్దిరెడ్డి వద్దకు వెళ్లి తన నియోజకవర్గంలోని పరిస్థితిని వివరించారు. ఇక, సీఎం జగన్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే మాటకే ప్రాధాన్యత ఇస్తారని..తనకు వ్యతిరేకంగా పని చేస్తున్న వారి గురించి ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేస్తానంటూ రోజా హెచ్చరించారు.

రోజాకు వ్యతిరేకంగా నిరసనలు
ఇప్పుడు నగరిలో ముఖ్యమంత్రి జగన్ జన్మదిన వేడుకల నిర్వహణ ఏర్పాట్లు జరగుతున్నాయి. వేడుకలు నిర్వహించేందుకు రోజా వర్గం తో పాటుగా ప్రత్యర్ది వర్గం సైతం ఏర్పాట్లు చేస్తోంది. అందులో ప్రత్యర్ది వర్గం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చించేసారు. ఇది రోజా మద్దతు దారుల పనేనంటూ ప్రత్యర్ది వర్గం ఆందోళనకు దిగింది. రోజా అనుకూల .. వ్యతిరేక వర్గాలు విడిపోయిన అధికార పార్టీ శ్రేణులు సీఎం జగన్ జన్మదిన వేడుకల నిర్వహణ పైన పోటా పోటీ సమావేశాలు నిర్వహిస్తున్నారు. పుత్తూరులోని ఏలుమలై ఇంట్లో సమావేశమైన ఎమ్మెల్యే రోజా ప్రత్యర్ధి వర్గాలు మంగళవారం నిర్వహించ తలపెట్టిన జగన్ జన్మదిన వేడుకలకు ఏర్పాట్లపై చర్చించారు.

సీఎం జన్మదిన వేడుకల నిర్వహణ లోనూ
పుత్తూరులో దాదాపు పది వేలమంది కార్యకర్తలతో ర్యాలీ, కార్వేటినగరం కూడలిలో బహిరంగ సభ నిర్వహించాలని,నాలుగు ప్రదేశాలలో అన్నదానం చేయాలని నిర్ణయించారు. ఎమ్మెల్యే వర్గం కూడా జగన్ పుట్టిన రోజు వేడుకలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అయిదు మండలాల్లో తన వర్గం తరపున గెలిచిన ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లను జగన్ పుట్టినరోజు వేడుకల్లో భాగస్వాములను చేసి సత్తా చాటాలని వ్యూహరచన చేస్తున్నారు. నగరిలో పెద్దఎత్తున ర్యాలీ, బహిరంగ సభ, అన్నదానాలు చేయాలని భావిస్తున్నారు.

మంత్రిగా అవకాశం పై ప్రభావం
అధికార పార్టీ కార్యకర్తలు ఒకేసారి జరిగే రెండు కార్యక్రమాల్లో ఎటువైపు మొగ్గాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. ఇక, త్వరలో జరిగే మంత్రివర్గ విస్తరణలో ఈ సారి రోజాకు ఖాయమని అనుచరులు నమ్ముతున్నారు. ఈ సమయంలో సొంత నియోజవకర్గంలో జరుగుతున్న పరిణామాలు ప్రస్తుత పరిస్థితుల్లో మైనస్ గా మారే అవకాశం ఉంది. అయితే, సీఎం జగన్ ను రోజా మీద చాలా నమ్మకం ఉందని చెబుతున్నారు. దీంతో..ఈ పరిస్థితుల్లో రోజా మంత్రి అవుతారా లేదా అనేది ఇప్పుడు చిత్తూరు జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారుతోంది.












Click it and Unblock the Notifications