జగన్ వైసీపీ యుద్ధం ప్రకటించిందా? - హైకోర్టు షాకింగ్ కామెంట్స్ - స్పీకర్పై కేసుకు సీబీఐని రప్పిస్తాం
ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు, రాష్ట్ర హైకోర్టుకు మధ్య సంబంధాలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోన్నవేళ గురువారం అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. జగన్ సర్కారుకు, హైకోర్టుకు మధ్య ఏదో జరుగుతోందని ఇన్నాళ్లూ మీడియాలో వార్తలు వస్తుండగా.. వైసీసీ కీలక నేతలు తరచూ కోర్టులపై కామెంట్ల చేస్తుండటం చూస్తున్నాం.. కాగా, తొలిసారి ప్రభుత్వంతో విభేధాలపై జడ్జిలు బాహాటంగా తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

అసలేం జరిగిందంటే..
జగన్ సర్కారు పథకాలు, విధానాలు, గతంలో చోటుచేసుకున్న అక్రమాలపై విచారణ తదితర అంశాలకు సంబంధించిన పలు నిర్ణయాలను హైకోర్టు తరచూ తప్పుపడుతుండటం, స్టే ఉత్తర్వులు ఇస్తుండటం తెలిసిందే. చట్టబద్ధంగా కోర్టులు చేస్తున్న పనిని లేదా వెలువరిస్తున్న ఆదేశాలపై ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీకి చెందిన నేతలు, ప్రజాప్రతినిధులు, ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం అనూహ్య వ్యాఖ్యలు చేస్తుండటంపై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా జగన్ పార్టీని, ప్రభుత్వాన్ని ఉద్దేశించి జడ్జిలు షాకింగ్ కామెంట్లు చేశారు.

న్యాయవ్యవస్థపై యుద్ధం
ఏపీ హైకోర్టు తీర్పులు, ఆదేశాలను ఉద్దేశించి అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం, ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి, ఎంపీలు నందిగం సురేశ్, విజయసాయిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ పలు సందర్భాల్లో చేసిన కామెంట్లపై విచారణ జరిపిన హైకోర్టు.. సదరు నేతల వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించేలా ఉన్నాయని, వ్యవహారం చూస్తోంటే జగన్ వైసీపీ న్యాయవ్యవస్థపై యుద్ధం ప్రకటించినట్లుగానే భావించాల్సి ఉంటుందని హైకోర్టు పేర్కొంది.

మమ్మల్ని తిట్టినా కేసుల్లేవా?
‘‘వైసీపీ నేతల కామెంట్లు కోర్టులపై దాడిగానే పరిగణిస్తున్నాం. న్యాయవ్యవస్థను ఉద్దేశించి అలా మాట్లాడిన నేతలపై పోలీసులు ఎందుకని కేసులు పెట్టడంలేదు? అదే ప్రభుత్వాన్ని ఎవరైనా విమర్శిస్తే వెంటనే కేసులు పెడుతున్నారే.. న్యాయవ్యవస్థ విషయంలో భిన్నంగా ఉన్నారెందుకు? చివరికి కోర్టు రిజిస్ట్రార్ కేసు దాఖలు చేసినప్పటికీ.. పదవుల్లో ఉన్న వ్యక్తులపై కేసులు ఎందుకు పెట్టట్లేదు?'' అని హైకోర్టు అడ్వొకేట్ జనరల్ ను నిలదీసింది. అదే క్రమంలో శాసన వ్యవస్థలో కీలకమైన స్పీకర్ ను ఉద్దేశించి కూడా జడ్జిలు కీలక వ్యాఖ్యలు చేశారు.

స్పీకర్ తమ్మినేనిపై ఆగ్రహం..
న్యాయవ్యవస్థను ఉద్దేశించి ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం చేసిన వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించేలా ఉన్నాయని హైకోర్టు అభిప్రాయపడింది. కొద్ది రోజుల కిందట స్పీకర్ తమ్మినేతి మీడియాతో మాట్లాడుతూ.. కోర్టు తీర్పులపై జనం తిరగబడే రోజు త్వరలోనే ఉందని, సీఎం జగన్ మౌనం బద్ధలైతే ప్రళయం వస్తుందని అన్నారు. కాగా, ఆ వ్యాఖ్యలు శాసనసభలో చేశారా? లేక బయట చేశారా? అని జడ్జిలు ఆరా తీయగా.. తిరుపతి కొండపై మీడియాతో మాట్లాడుతూ స్పీకర్ సదరు వ్యాఖ్యలు చేశారని హైకోర్టు స్టాండింగ్ కౌన్సిల్ న్యాయవాది గుర్తుచేశారు.
Recommended Video

సీబీఐని పిలిపిస్తాం..
కోర్టు తీర్పులు, న్యాయవస్థను ఉద్దేశించి స్పీకర్, ఎంపీ పదవుల్లో ఉన్న వైసీపీ నేతలు, పార్టీ సోషల్ మీడియా విభాగం అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నా ఏపీ సీఐడీ విభాగం తగిన చర్యలు తీసుకోవడంలేదన్న హైకోర్టు.. నేతలను రక్షించేందుకే సీఐడీ వారు కేసులు నమోదు చేయడంలేదని భావించాల్సి ఉంటుందని వ్యాఖ్యానించింది. అంతేకాదు, అనుచిత వ్యాఖ్యలపై కేసుల విషయంలో సీఐడీ విఫలమైతే సీబీఐని పిలిపిస్తామని, దర్యాప్తును కేంద్ర సంస్థకు అప్పగిస్తామని హైకోర్టు పేర్కొంది. సీఐడీకి బదులు సీబీఐ చేత విచారణ చేయిస్తే ఏపీ ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదని ఏజీ శ్రీరామ్ తెలిపారు. సీఐడీ న్యాయవాది సైతం ఇందుకు సమ్మతించారు. దీంతో ఉన్నత న్యాయస్థానం తీర్పును రిజర్వులో ఉంచింది.












Click it and Unblock the Notifications