'అసలు నైజం బయటపడుతోంది, నిరూపించుకోవాల్సింది జగనే, ఇంత దివాలాకోరు?'
జగన్ అవినీతిపరుడో? కాదో? అన్నది నిరూపించుకోవాల్సింది ఆయనేనని, తన వద్ద అక్రమాస్తులు లేవని నిరూపించుకోవాలని చంద్రబాబు అన్నారు.
Recommended Video
విజయవాడ: ప్యారడైజ్ పేపర్స్లో తన పేరు ఉందని ప్రచారం చేస్తున్న టీడీపీ.. దమ్ముంటే 15రోజుల్లోగా తనకు విదేశాల్లో ఆస్తులున్నాయన్నది నిరూపించాలని వైసీపీ అధినేత జగన్ సవాల్ విసిరిన సంగతి తెలిసిందే.
ప్రతిపక్షం బరితెగింపు, మనం దేశానికే ఆదర్శం: బాబు దిశానిర్దేశం
ప్రజా సంకల్ప యాత్ర సమయంలో ఇలాంటి ప్రచారం ద్వారా తమ పార్టీని దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే ప్రజలెవరూ టీడీపీ మాటలను నమ్మబోరని కూడా వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు జగన్ సవాల్ పై స్పందించారు.
నిరూపించుకోవాల్సింది ఆయనే:
జగన్ అవినీతిపరుడో? కాదో? అన్నది నిరూపించుకోవాల్సింది ఆయనేనని, తన వద్ద అక్రమాస్తులు లేవని నిరూపించుకోవాలని చంద్రబాబు అన్నారు. జగన్ అవినీతి సొమ్ము రాష్ట్రానికే దక్కాలని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఈడీ జప్తు చేసిన ఆస్తులను రాష్ట్రానికి ఇవ్వాలని, అది రాష్ట్ర ప్రజలకు మాత్రమే చెందాలని స్పష్టం చేశారు. గురువారం నిర్వహించిన టీడీపీ శాసనసభాపక్ష సమావేశంలో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇలాంటి ప్రతిపక్షాన్ని చూడలేదు:
తన నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో ఇలాంటి దివాలాకోరు ప్రతిపక్షాన్ని ఎప్పుడూ చూడలేదన్నారు. ఉపాధి హామి పథకంపై కేంద్రానికి ప్రతిపక్షం తప్పుడు రిపోర్టులు పంపించిందని, ఆ పార్టీ అసెంబ్లీకి వచ్చి ఉంటే లేఖలన్ని బయటపెట్టేవాళ్లమని అన్నారు. జగన్ రాసిన లేఖలపై కేంద్రం విచారించిందని, ఆ తర్వాత నిధులు కూడా మంజూరు చేసిందని గుర్తుచేశారు. చీటికి మాటికీ స్పీకర్ మీద విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వెనక్కి తగ్గితే ఏమయ్యేది?
వైసీపీ ఆరోపణలకు భయపడి పట్టిసీమ ప్రాజెక్టు విషయంలో వెనక్కి తగ్గి ఉంటే ఏమయ్యేదని ప్రశ్నించారు. ఈ రోజు కృష్ణా జిల్లా రైతులకు ఎకరానికి 50 బస్తాల దిగుబడి వచ్చి వచ్చి ఉండేదా? అని నిలదీశారు.
ప్రాజెక్టుపై ప్రజలను గందరగోళపరిచేందుకు వైసీపీ నానా విఫలయత్నాలు చేసిందన్నారు. ఆఖరికి అసెంబ్లీ భవనం విషయంలోను లేని పోని రాద్దాంతాం చేశారన్నారు.భవనం లీకైందని ఆపోహలు సృష్టించేందుకు ప్రయత్నించారన్నారు.
జగన్ బాధ్యతారాహిత్యానికి నిదర్శనం
గతంలో రైతు రుణమాఫీ వీలుకాదని, అందుకే తాను ప్రకటించలేదని చెప్పిన జగన్ ఇప్పుడు తాను అధికారంలోకి వస్తే పింఛను సొమ్మును రూ.మూడు వేలకు పెంచుతాననడం ఆయన బాధ్యతారాహిత్య రాజకీయానికి నిదర్శమని చంద్రబాబు మండిపడ్డారు. తనను నమ్మి ఓట్లు వేసిన జనం కోసం నిరంతరం శ్రమిస్తున్నానని చెప్పుకొచ్చారు. తమ ప్రభుత్వంపై ప్రజలు పూర్తి విశ్వాసంతో ఉన్నారని పేర్కొన్నారు.
అసలు నైజం బయటపడుతోంది
గత ఎన్నికల్లో ప్రభుత్వానికి, ప్రతిపక్షానికి మధ్య ఉన్న ఓట్ల తేడా 1.6 శాతమే కాగా నంద్యాల, కాకినాడ ఎన్నికల తర్వాత అది 16 శాతానికి పెరిగిందని గుర్తుచేశారు. రాజధాని కోసం రైతులు 33 వేల ఎకరాలను ఇచ్చారని, వాటిని అభివృద్ధి చేసి తిరిగి వారికే అప్పగిస్తామని మరోసారి హామి ఇచ్చారు.
రైతుల భూములు రైతుల వద్దే ఉంటే.. వైసీపీ మాత్రం లక్ష కోట్ల అవినీతి అంటూ గగ్గోలు పెడుతోందని, దీన్ని బట్టి వాళ్ల అసలు నైజం బయటపడుతోందని అన్నారు.తాము పనిచేసేది ప్రజల కోసమే తప్ప ప్రతిపక్షం కోసం కాదని స్పష్టం చేశారు.