యాథృచ్చికం కాదు, కుట్రే!, ఎవరి పని?: చిత్తూరు ప్రమాదంపై అనుమానాలు(ఫోటోలు)
స్థానిక నాయకుల హస్తం ఉండటం, అధికారులు, పోలీసులంతా కుమ్మక్కవడం వల్లే ఇసుక మాఫియాపై ఎవరూ ఎలాంటి చర్యలు తీసుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
చిత్తూరు: చిత్తూరు నగరంలోని ఏర్పేడు సమీపంలో జరిగిన ప్రమాద ఘటనపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. ఘటనపై అనుమానాలు లేవనెత్తుతున్న స్థానికులు.. ఇది యాథృచ్చికం కాదని, కుట్ర కోణం ఉందని అభిప్రాయపడుతుండటం గమనార్హం.
లారీ ప్రమాద ఘటనతో ఏర్పేడులో పూర్తి విషాద ఛాయలు అలుముకోగా.. ఆ ప్రాంతమంతా భీతావహ దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇంత భారీ ప్రమాద ఘటన జరిగినా.. ఇంతవరకు ఒక్క ఎమ్మెల్యే కూడా తమను పరామర్శించిన పాపాన పోలేదని వారు వాపోతున్నారు.
మృతుల్లో 11మంది ఏర్పేడు వాసులే:
శుక్రవారం నాడు ఇసుక లారీ అదుపు తప్పి దుకాణాల పైకి దూసుకెళ్లడంతో.. మొత్తం 13మంది మరణించారు. ఇందులో 11మంది ఏర్పేడు వాసులే కావడంతో.. ఆ ఊరంతా విషాదంలో మునిగిపోయింది. చనిపోయినవాళ్లంతా పేద, మధ్య తరగతివారే కావడంతో.. వారి కుటుంబాలు తీవ్రంగా విలపిస్తున్నాయి.
ఎక్స్ గ్రేషియా, ఉపాధి డిమాండ్:
బాధిత కుటుంబాలకు రూ.5లక్షల ఎక్స్ గ్రేషియాతో పాటు ఇంటికొక ఉపాధి కల్పించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు వారు సంతకాల సేకరణ చేపట్టారు. ఈ డిమాండ్స్ తో పాటు ఇసుక మాఫియా ఆగడాలను నియంత్రించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని ప్రభుత్వాన్ని వారు నిలదీయనున్నారు.
నాయకులు, ఇసుక మాఫియా కుమ్మక్కై:
స్థానిక టీడీపీ నాయకుడు ఒకరు ప్రమాద ఘటనపై స్పందిస్తూ.. స్థానికంగా ఉన్న టీడీపీ నేతలు, ఇసుక మాఫియా రెండూ కుమ్మకయ్యాయన్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందని ఆరోపించారు. సమీపంలో ఉన్న కాల్వలోని ఇసుకంతా తోడేస్తుండటంతో చుట్టు పక్కల పంట పొలాలన్ని ఎండిపోతున్నాయని తెలిపారు.
ఇంత నిర్లక్ష్యమా?:
ఇసుక మాఫియాపై గత ఆరు నెలల నుంచి ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, వారి నిర్లక్ష్యం వల్లే ఈరోజు 13మంది బలైపోయారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఆఖరికి ప్రమాదం జరిగిన తర్వాత స్థానిక సీఐ, ఎస్ఐ కూడా సకాలంలో స్పందించలేదని, ఆసుపత్రిలోను ఇదే పరిస్థితి ఎదురైందని, ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
బాధితులకు మంత్రి లోకేష్ ఓదార్పు:
చనిపోయిన వారి కుటుంబాలను ఓదర్చడానికి మంత్రి లోకేష్ ఈరోజు ఏర్పేడుకు రానున్నారు. మృతుల కుటుంబాలను పరామర్శించి వారికి భరోసా ఇచ్చే ప్రయత్నం చేయనున్నారు. బాధిత కుటుంబాలను ఓదార్చిన అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసే సభలో ప్రసంగించనున్నారు. లోకేష్ తో పాటు మంత్రి మాణిక్యాలరావు, ఎమ్మెల్యే అమరనాథ్ రెడ్డి కూడా ఏర్పేడుకు రానున్నారు.
స్థానిక నాయకుల హస్తం:
స్థానిక నాయకుల హస్తం ఉండటం, అధికారులు, పోలీసులంతా కుమ్మక్కవడం వల్లే ఇసుక మాఫియాపై ఎవరూ ఎలాంటి చర్యలు తీసుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రధానంగా స్థానిక మాజీ జడ్పీటీసీ, మరో నాయకుడితో పాటు జిల్లాకు చెందిన ఓ ప్రజాప్రతినిధి కుమారుడు ఈ ఇసుక మాఫియా వెనుక ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లుగా వారు చెబుతున్నారు.
తీవ్ర తాగునీటి ఎద్దడి:
ఇసుక మాఫియా ఆగడాలతో తమ పంటలన్ని ఎండిపోతున్నాయని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. పంట కాల్వల్లోని ఇసుకను పూర్తిగా తవ్వేస్తుండటంతో.. చుట్టు పక్కల పొలాలకు చుక్క నీరు కూడా అందడం లేదని ఆరోపిస్తున్నారు. స్థానికులంతా ఎక్కువగా వ్యవసాయదారులే కావడం వల్ల పరిస్థితి దయనీయంగా ఉందన్నారు.