కష్టం.. విశాఖలో అవి లేవు, ఐటీ కంపెనీలు రావడానికి సిద్దంగా లేవు: లోకేష్
బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాలను వదిలి విశాఖ రావడానికి ఐటీ కంపెనీలు సిద్దంగా లేవని స్పష్టం చేశారు.
విశాఖపట్నం: విశాఖపట్నంలో పర్యటిస్తున్న ఐటీ మంత్రి నారా లోకేష్.. ఐటీ పరిశ్రమల రాక విషయంలో ఎదురవుతున్న ఇబ్బందులను మీడియాకు వివరించారు. విశాఖపట్నంలో కంపెనీలను నెలకొల్పేందుకు ఐటీ సంస్థలు సిద్దంగా లేవని అన్నారు.
విశాఖపట్నంలో సోషల్ ఎకో సిస్టం లేదని, డైరెక్ట్ ఫ్లైట్స్ కూడా లేవని చెప్పారు. అంతర్జాతీయ ప్రమాణాలున్న స్కూల్స్ కూడా లేవని, ఇలాంటి పరిస్థితుల్లో బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాలను వదిలి విశాఖ రావడానికి ఐటీ కంపెనీలు సిద్దంగా లేవని స్పష్టం చేశారు.
ఇవేగాక మరెన్నో ఇబ్బందులు వెంటాడుతున్నాయన్నారు. ఇక ప్రైవేటు ఉద్యోగాల్లో స్థానిక కోటా గురించి మాట్లాడుతూ.. అది కుదరదని స్పష్టం చేశారు. అలాంటి కోటా ఉంటే ఏ సంస్థలూ కంపెనీ పెట్టేందుకు ముందుకు రావని చెప్పారు.
విశాఖలో 2014కి ముందు కొన్ని ఐటీ సంస్థలకు కేటాయించిన స్థలాల్లో ఇప్పటికీ ఎలాంటి కార్యకలాపాలు లేవని, అలాంటి వాటిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఎలక్ట్రానిక్స్ యూనిట్ల ఏర్పాటులో తిరుపతి క్లస్టర్ పై ఔత్సాహికులు ఆసక్తి కనబరుస్తున్నారని చెప్పారు. సెల్ఫోన్ల తయారీ క్లస్టర్గా తిరుపతి అభివృద్ధి చెందుతోందన్నారు.