జేసీపై పోస్టేనా?: ఐవైఆర్ కృష్ణారావు రగడ ఎక్కడ్నుంచి మొదలైందంటే?
మాజీ సీఎస్, ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ తాజా మాజీ ఛైర్మన్ ఐవైఆర్ కృష్ణారావు అంశం రాష్ట్రంలో సంచలనంగా మారింది.
అమరావతి/హైదరాబాద్: మాజీ సీఎస్, ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ తాజా మాజీ ఛైర్మన్ ఐవైఆర్ కృష్ణారావు అంశం రాష్ట్రంలో సంచలనంగా మారింది. తన అధికారిక ఫేస్బుక్ పేజీ నుంచి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఉన్న పోస్టులను ఆయన షేర్ చేయడంతో ప్రభుత్వం సీరియస్ అయింది. దీంతో ఆయనపై వేటుపడింది.
చంద్రబాబు బాధ పెట్టారు, ఆ ఉద్దేశం లేదు: ఐవైఆర్ కృష్ణారావు సంచలనం
ఇక టీడీపీ వర్గాల్లో అయితే ఉదయం నుంచి దీనిపైనే చర్చ జరుగుతోంది. కొందరు టీడీపీ మద్దతుదారులు ఆయన తీరును ఫేస్బుక్ ద్వారా ఖండించారు. మరికొందరైతే నేరుగా ఆయనకే ఫోన్ చేసి.. ఆ పోస్టులను మీరే పెట్టారా? అని ప్రశ్నించారు.
అయితే, టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వివాదంతోనే ఐవైఆర్ సోషల్ మీడియా రగడ మరింత పెద్దదైందని పలువురు పేర్కొంటున్నారు. విశాఖ విమానాశ్రయంలో ఇండిగో సిబ్బందితో దివాకర్ రెడ్డి దురుసుగా ప్రవర్తించిన తర్వాత... వీవీఐపీలు కొంచెం ఆలస్యంగా విమానాశ్రయానికి వచ్చినా, వారిని విమానంలోకి అనుమతించాలని ఓ టీడీపీ మద్దతుదారుడు ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు.
ఈ పోస్టుపై వైవీఆర్ తీవ్రంగా స్పందించారు. మీకైమైనా బుద్ధి ఉందా? అని ప్రశ్నించారు. ప్రజలకు ఇబ్బందులు కలిగేలా నేతలు వ్యవహరిస్తారా? అంటూ నిలదీశారు. ఆ తర్వాతే ఐవైఆర్కు సంబంధించిన వివాదం మొదలైనట్టు తెలుస్తోంది. అంతకుముందు గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రానికి పన్ను మినహాయింపు ఇవ్వడాన్ని కూడా ఐవైఆర్ వ్యతికించడం గమనార్హం. బాహుబలి-2కి టికెట్ల ధరలు పెంపుదలను ఆయన వ్యతిరేకించారు.