సమాధానమేది?: గుణశేఖర్కు ఐవైఆర్ అనూహ్య మద్దతు
అమరావతి: ఏపీ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డులపై విమర్శలు గుప్పించిన సినీ దర్శకుడు గుణశేఖర్కు ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు నుంచి అనూహ్య మద్దతు లభించింది. నంది అవార్డుల్లో తాను నిర్మించిన 'రుద్రమదేవి' సినిమాకు అన్యాయం జరిగిందని గుణశేఖర్ ఆరోపించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో గుణశేఖర్కు మద్దతు పలుకుతూ ఐవైఆర్ కృష్ణారావు ప్రభుత్వాన్ని నిలదీశారు. గుణశేఖర్ ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాడ్ చేశారు. గతంలో తాను కూడా ఇలాంటి ప్రశ్నలు అడిగానని, అప్పట్లో తన ప్రశ్నలు నచ్చక ప్రభుత్వం పెద్దల నుంచి ఎలాంటి సమాధానం రాలేదని చెప్పారు.
గత కొంతకాలంగా ఏపీ సీఎం చంద్రబాబునాయుడును లక్ష్యం చేసుకుని ఐవైఆర్ కృష్ణారావు విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. పలుమార్లు తన సోషల్ మీడియా ఎకౌంట్లలో పోస్టులు పెట్టి కూడా విమర్శలు గుప్పించారు. కాగా, తాజా నంది అవార్డులు కమ్మవారికి ఇచ్చారంటూ పలువురు సినీ ప్రముఖులు కూడా విమర్శలు చేస్తుండటం గమనార్హం.