భయమెందుకని జగదీశ్వర్, బాబు మెట్టు దిగినా: గంటా
హైదరాబాద్: విద్యార్థులలో ఎవరు తెలంగాణావారో, ఎవరు కాని వారో తేలిన తర్వాతే ఫీజు బకాయిలు చెల్లిస్తామని, అప్పటి వరకూ చెల్లించే పరిస్థితి లేదని తెలంగాణా విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి శనివారం స్పష్టం చేశారు. ఇంజనీరింగ్ బకాయిలు చెల్లించాలని ఇంజనీరింగ్ కళాశాలలు కోరుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడే ఆ బకాయిలు చెల్లించే పరిస్థితి లేదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజల స్థితిగతులపై త్వరలోనే సర్వే జరగనుందని, అప్పుడే అన్ని విషయాలూ బయటకు వస్తాయన్నారు.
ఆ తర్వాతే ఫీజు చెల్లింపు విషయమూ తేలుతుందన్నారు. పాత బకాయీలు చెల్లించిన తర్వాతే తనిఖీలు చేపట్టాలన్న ఇంజినీరింగ్ కళాశాలల యాజమాన్యాల విజ్ఞప్తిని ఆయన తోసిపుచ్చారు. తప్పు చేసిన వాళ్లు తనిఖీలకు భయపడతారని, చేయని వాళ్లకు భయమెందుకని ప్రశ్నించారు. రెండు మూడేళ్లు బకాయిలి రావాల్సి ఉందంటున్నారని, రాష్ట్రం ఏర్పడక ముందే వాటిని ఎందుకు తెచ్చుకోలేదని ప్రశ్నించారు. ఇన్నేళ్లు ఆగని వారు, ఇంకొన్ని రోజులు ఆగలేరా అన్నారు.
సరికాదన్న గంటా
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక తెలంగాణ ఉన్నత విద్యామండలిని ఏర్పాటు చేయడం రాజ్యాంగ విరుద్ధమని ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాస రావు అన్నారు. శనివారం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరులో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పదేళ్ల వరకు రెండు రాష్ట్రాల్లోనూ ఉన్నత విద్యా కోర్సులకు ఉమ్మడి ప్రవేశపరీక్షలు నిర్వహించుకోవాలని విభజన బిల్లులో పొందుపరిచారని, తెలంగాణ రాష్ట్ర సర్కార్ దాన్ని ఉల్లంఘించే విధంగా వ్యవహరిస్తోందన్నారు.
తెలంగాణ ప్రభుత్వ తీరును కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతామన్నారు. 1956కు పూర్వం హైదరాబాద్లో నివాసమున్నవారికే స్థానికత కల్పిస్తామని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించడం చట్ట వ్యతిరేకమని, రాజ్యాంగస్ఫూర్తికి విరుద్ధమని గంటా వ్యాఖ్యానించారు. ఎంసెట్ విద్యార్థులకు కౌన్సెలింగ్ ప్రక్రియను గత నెల 30వ తేదీ నుంచి జరిగే విధంగా నోటిఫికేషన్ జారీ చేశామన్నారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ను ఈ నెల 7వ తేదీ నుంచి ప్రారంభించనున్నామని తెలిపారు.
ఈ సమయంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయం సరైనది కాదన్నారు. ఏపీ విద్యార్థుల కోసం సీఎం చంద్రబాబు ఓ మెట్టు దిగి తెలంగాణ సీఎం కేసీఆర్తో చర్చించేందుకు నిర్ణయం తీసుకున్నారని, అయితే, హరీష్ రావు గిల్లికజ్జాలు పెట్టుకునే విధంగా మాట్లాడుతున్నారని, కేసీఆర్ సైతం ఉద్యమనాయకుడిలా మాట్లాడుతున్నారన్నారు.