జగన్ బెయిల్ రద్దు: నోటీసులు జారీ చేసిన సీబీఐ కోర్టు -మే7 డెడ్లైన్ -ప్రధాని మోదీకి ఎంపీ రఘురామ లేఖ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. క్విడ్ ప్రోకో కేసులకు సంబంధించి 11 చార్జిషీట్లలో నిందితుడిగా ఉంటూ, బెయిల్ పై బయటున్న ఆయనకు సీబీఐ కోర్టు మరోసారి షాకిచ్చింది. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామృష్ణంరాజు దాఖలు చేసిన 'జగన్ బెయిల్ రద్దు' పిటిషన్ ను విచారణకు స్వీకరించిన మరుసటిరోజే కోర్టు ప్రక్రియను మొదలుపెట్టింది. సీఎం జగన్ తోపాటు దర్యాప్తు సంస్థ సీబీఐకీ బుధవారం నోటీసులు జారీ చేసింది.
నేను బతికింది చాలు, యువకుడికి బెడ్ ఇవ్వండి :ఆస్పత్రి నుంచి వృద్ధుడి వాకౌట్, మృతి -కదిలించే గాథ
సీఎం, సీబీఐకి నోటీసులు..
క్విడ్ ప్రోకో వ్యవహారాలకు సంబంధించి 11 చార్జిషీట్లలో ఏ1గా ఉన్న జగన్ సీఎం పదవిని అడ్డంపెట్టుకుని కేసులను నీరుగారుస్తూ, సీబీఐ అధికారులు, సాక్ష్యులను ప్రలోభాలకు గురిచేస్తున్నారని, సహ నిందితులకు ప్రభుత్వంలో, పార్టీలో ఉన్నతపదవులు కట్టబెట్టారని, ఏకంగా సుప్రీంకోర్టు జడ్జి(ప్రస్తుత సీజేఐ రమణ)పై సైతం అనుచితాలకు పాల్పడ్డారని, జగన్ చేసిన, చేస్తున్న ఈ పనులన్నీ నిబంధనలకు విరుద్ధమే కాబట్టి వెంటనే బెయిల్ రద్దు చేసి, కేసుల విచారణను త్వరిత గతిన పూర్తి చేయాలని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ పిటిషన్ లో కోరారు. సదరు పిటిషన్ ను విచారణకు స్వీకరిస్తున్నట్లు మంగళవారమే ప్రకటించిన సీబీఐ కోర్టు.. బుధవారం నాడు ఏపీ సీఎం జగన్, సీబీఐలకు నోటీసులు జారీ చేసింది.
మే 7న తదుపరి విచారణ..
క్విడ్ ప్రోకో సంబందిత కేసుతో అసలు సంబంధమేలేని (థార్డ్ పార్టీ) ఎంపీ రఘురామకృష్ణంరాజుకు బెయిల్ రద్దు పిటిషన్ వేసే అర్హతే లేదని నాంపల్లి సీబీఐ కోర్టు రిజిస్ట్రార్ తొలుత అభ్యంతరం చెప్పారు. కానీ సుప్రీంకోర్టు గత ఉత్తర్వుల ప్రకారం కీలక కేసుల్లో థార్డ్ పార్టీ జోక్యాన్ని కాదనడానికి వీల్లేదని రఘురామ తరఫు న్యాయవాది శ్రీనివాస్ మంగళవారం నాటి విచారణలో వాదించారు. చివరికి పిటిషన్ విచారణకే మొగ్గుచూపిన జడ్జి బీఆర్ మధుసూదన్ రావు బుధవారం నాడు ప్రతివాదులైన సీఎం జగన్, సీబీఐలకు నోటీసులు జారీ చేస్తూ, తదుపరి విచారణను మే 7కు వాయిదా వేశారు. పిటిషన్ ను విచారణకు చేపట్టిన వెంటనే జగన్ కు నోటీసులు ఇవ్వడం, తొమ్మిది రోజుల్లోనే తదుపరి తేదీని వెలువరించిన దరిమిలా విచారణ వేగంగా సాగే అవకాశాలున్నాయి. ఇదిలా ఉంటే,
Recommended Video
ప్రధాని మోదీకి ఎంపీ రఘురామ లేఖ
సీఎం జగన్ ను మళ్లీ జైలుకు పంపేదాకా ఏపీలో అడుగుపెట్టబోనని శపథం చేసిన వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు మరో చర్యకు పాల్పడ్డారు. బెయిల్ రద్దు అంశంలో జగన్ కు తిప్పలు తప్పవంటోన్న ఆయన తాజాగా ఏపీలో పరీక్షల వివాదంపై ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. కరోనా విలయతాండవం చేస్తున్న ఏపీలో జగన్ సర్కారు మొడిపట్టుదలకు పోయి విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతోందని, ఏపీలో పరీక్షలు రద్దయ్యేలా కేంద్రమే జోక్యం చేసుకోవాలని ప్రధానిని ఎంపీ రఘురామ కోరారు.