ఆస్తుల కేసులో అధికారికి ఊరట: జగన్పై కేసు వీగిపోతుందా, రాజకీయ మార్పులా?
న్యూఢిల్లీ/విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల వ్యవహారంలో భాగంగా లేపాక్షి నాలెడ్జ్ హబ్ అంశానికి సంబంధించి సీబీఐ కేసులో ఆధారాలను పరిశీలిస్తే ఐఏఎస్ అధికారి, నాటి పరిశ్రమలు, వాణిజ్యశాఖ కార్యదర్శి శాంబాబ్పై ఎలాంటి కేసూ లేదని కేంద్రం తేల్చి చెప్పింది.
2005-10 నాటి పారిశ్రామిక ప్రోత్సాహక విధానంలోని నిబంధనల ప్రకారమే వ్యవహరించారని పేర్కొంది. శాంబాబ్ అక్రమంగా లబ్ధి పొందినట్లు సీబీఐ ఎలాంటి ఆరోపణలు చేయలేదని తెలిపింది. అన్నింటినీ పరిశీలించాక శాంబాబ్పై కేసు లేనందున అవినీతి నిరోధక చట్టం కింద ప్రాసిక్యూషన్కు అనుమతిని నిరాకరిస్తున్నట్లు డీఓపీటీ కార్యదర్శి రాజ్ కిషన్ ఇటీవల సీబీఐకి సమాచారం పంపారు.
జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో భాగంగా ఇందూ ప్రాజెక్ట్స్ లిమిటెడ్.. నాటి ప్రభుత్వం నుంచి పలు రకాలుగా లబ్ధి పొందిందని, ఆ కంపెనీకి చెందిన లేపాక్షి నాలెడ్జ్ హబ్కు అనంతపురం జిల్లాలో 8841 ఎకరాలను తక్కువ ధరకు మార్గదర్శకాలకు విరుద్ధంగా కేటాయించారని సీబీఐ ఆరోపించింది. ఈ భూమిని బ్యాంకుల్లో తాకట్టు పెట్టి రుణాలు పొందడానికి అనుమతించారని పేర్కొంది.
అందువల్ల ఈ ప్రక్రియలో భాగంగా అప్పటి పరిశ్రమలు, వాణిజ్యశాఖ కార్యదర్శి శాంబాబ్ను నిందితుడిగా చేర్చి అవినీతి నిరోధక చట్టం కింద ప్రాసిక్యూషన్కు అనుమతి కోరుతూ 2013 సెప్టెంబరులో కేంద్రానికి లేఖ రాస్తూ మొత్తం దస్త్రాలను కేంద్రానికి పంపింది.
వీటన్నింటిని పరిశీలించడంతోపాటు సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ను సంప్రదించి ప్రాసిక్యూషన్కు ఎందుకు అనుమతి నిరాకరిస్తున్నామో వెల్లడించింది. ఇటీవల కూడా కేంద్రం ఒకటి రెండుసార్లు అనుమతి నిరాకరించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో పలువురి మధ్య చర్చ జరుగుతోంది. ఏపీలో రాజకీయంగా పావులు కదుపుతున్నారా? మార్పులు జరిగేనా? అనే చర్చ సాగుతోంది. కాగా, నాటి అధికారులది, మంత్రులది తప్పులేనప్పుడు జగన్ ఎలా దోషి అవుతారని చాలారోజులుగా వైసిపి నేతలు ప్రశ్నిస్తున్న విషయం తెలిసిందే.