జనసేనకు తలనొప్పిగా జగన్ హస్తిన టూర్లు .. రీజన్ ఇదే
ఏపీలో రాజకీయ పరిణామాలు ఉత్కంఠ రేపుతున్నాయి. జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకుని ఏపీలో ముందుకు వెళ్ళాలని భావించింది. రాజధాని అమరావతి కోసమే బీజేపీతో పొత్తు పెట్టుకున్నా అని జనసేనాని పవన్ కళ్యాణ్ చెప్పిన విషయం తెలిసిందే . ఇక ఆ తర్వాత కేంద్రం రాజధాని అంశంపై తమ స్పందన కూడా తెలియజేసింది . రాజధాని ఏర్పాటు నిర్ణయం పూర్తిగా రాష్ట్రాల పరిధిలోనిదని తేల్చి చెప్పింది . ఇక తాజాగా వైసీపీ అధినేత ఏపీ సీఎం వరుస హస్తిన పర్యటనలు, జరుగుతున్న ప్రచారం జనసేనను సందిగ్ధంలోకి నెడుతుంది.

జగన్ ఢిల్లీ పర్యటనలతో జనసేన వర్గాల్లో టెన్షన్
జగన్ ఢిల్లీ పర్యటనల నేపధ్యంలో ప్రతిపక్ష టీడీపీలోనే కాదు బీజేపీతో పొత్తు పెట్టుకున్న జనసేన వర్గాల్లోనూ టెన్షన్ మొదలైంది. తాజా పరిణామాలను బట్టి బీజేపీతో పొత్తు విషయంలో తాము తీసుకున్న స్టెప్తో రాజకీయంగా తమ పరిస్థితి అగమ్య గోచరంగా మారుతుందా అన్న సందిగ్ధంలో ఉన్నారని తెలుస్తుంది. జనసేన అధినేత పవన్ చాలా హోప్స్ తో బీజేపీతో జత కట్టారు. కానీ బీజేపీ పవన్ ఆశించిన మేరకు రాజధాని విషయంలో నిర్ణయం తీసుకోలేదు .

కేంద్రమంత్రివర్గంలో వైసీపీ చేరుతుందని ప్రచారం
ఇక తాజాగా సీఎం జగన్ ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీని కలవటం , మళ్ళీ వెంటనే రెండు రోజుల వ్యవధిలోనే అమిత్ షాతో భేటీ కావటం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు కారణం అవుతుంది .
ఇక మరోపక్క కేంద్రమంత్రివర్గంలో వైసీపీ చేరుతుందని ప్రచారం నడుస్తోంది. ఏపీలో అధికార పార్టీ మీద పోరాటం చెయ్యటానికి బీజేపీతో జత కడితే ఇప్పుడు వైసీపీ బీజేపీకి సన్నిహితంగా మారుతుంది అని , మంత్రివర్గంలో వై సీపీ ఎంపీలకు స్థానం దక్కుతుంది అని ప్రచారం జరుగుతుండటంతో జనసేన నేతలకు టెన్షన్ పట్టుకుంది.

జనసేన బీజేపీతో పొత్తు కొనసాగుతుందా అన్న చర్చ
బీజేపీతో కలిసి నడవాలని నిర్ణయిస్తే ఇలా బీజేపీ తమకు ఝలక్ ఇస్తుందా .. వైసీపీ విషయంలో సానుకూలంగా ఉందా ? అన్న ఆలోచన పార్టీ నేతల్లో వ్యక్తం అవుతుంది . వైసీపీ సర్కార్తో బీజేపీ కలిసి మందుకు సాగితే జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకోవటంలో అర్ధమే లేదు అని జనసేన నేతలు అంటున్నారు. మరోవైపు ఇటు జనసేన నేతలకు, బీజేపీ నేతలకు మధ్య గ్యాప్ కూడా పెరిగినట్టు తెలుస్తుంది. బీజేపీతో కలిసి నిర్వహించే కొన్ని సమావేశాలకు ఈ మధ్య జనసేన నేతలకు ఆహ్వానాలు వెళ్లడం లేదని సమాచారం .

వైసీపీ బీజేపీకి సన్నిహితంగా మారితే ఎలా ? అన్నదే ప్రశ్న
ఇక వైసీపీ బీజేపీకి సన్నిహితంగా మారితే తమ పరిస్థితి ఎలా ఉంటుంది అన్నది జనసేన వర్గాల్లో జరుగుతున్న చర్చ . పవన్ తీసుకున్న నిర్ణయాన్ని అప్పుడు సమర్ధించిన జనసేన నాయకులు ఇప్పుడు భవిష్యత్ పై పెద్ద బెంగతో ఉన్నారని సమాచారం . జనసేనాని పవన్ మాత్రం జరుగుతున్న పరిణామాలు గమనిస్తున్నారు. ఇక ఈ వ్యవహారం ఇలాగే ఉంటె పవన్ మాత్రం బీజేపీ విషయంలో కూడా భవిష్యత్ లో కుండ బద్దలు కొట్టటం తధ్యం .












Click it and Unblock the Notifications