సుప్రీం కోర్టుకు ఫేక్ అఫిడవిట్ సమర్పించి మరో సారి ఫేక్ సీఎం పేరు సార్ధకం చేసుకున్న జగన్ : లోకేష్ ధ్వజం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదవతరగతి మరియు ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సుప్రీం కోర్టులో జరిగిన విచారణ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోర్టుకు అందించిన అఫిడవిట్లో తాము అడిగిన సరైన వివరాలు ఏవీ లేవని ఆక్షేపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరోమారు సీఎం జగన్మోహన్ రెడ్డిని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ టార్గెట్ చేశారు. ఇప్పటికైనా పరీక్షలను నిర్వహించాలనే నిర్ణయాన్ని మార్చుకోవాలని, పరీక్షలు రద్దు చేయాలని లోకేష్ డిమాండ్ చేశారు.
సుప్రీం వ్యాఖ్యల నేపధ్యంలో జగన్ ను ఫేక్ సీఎం అన్న లోకేష్
ఈరోజు సుప్రీంకోర్టులో జరిగిన విచారణ నేపథ్యంలో కోర్టు ఏపీ ప్రభుత్వ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.పరీక్షలు నిర్వహించడానికి కావలసిన తరగతి గదులు ఉన్నాయా అని ప్రశ్నించింది. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో విద్యార్థుల ప్రాణాలకు ముప్పు వాటిల్లితే దానికి ఏపీ ప్రభుత్వమే బాధ్యత వహించాలని, ఎవరు మరణించిన కోటి రూపాయల పరిహారం చెల్లించాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో సీఎం జగన్ ని టార్గెట్ చేసిన లోకేష్ సుప్రీంకోర్టుకు ఫేక్ అఫిడవిట్ సమర్పించి మరోసారి ఫేక్ సీఎం అన్న పేరును జగన్ రెడ్డి సార్ధకం చేసుకున్నారని విమర్శించారు.
అన్ని రూమ్స్ ను, సిబ్బందిని ప్రభుత్వం సిద్ధం చేసిందా?
సరైన ప్రణాళిక లేని అఫిడవిట్ సమర్పించి సుప్రీం ధర్మాసనం చేత చీవాట్లు తిన్నారని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా పరీక్షల నిర్వహణ ఆలోచనకు స్వస్తి పలకాలని లోకేష్, అఫిడవిట్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన వివరాల మేరకు పరీక్షలు నిర్వహించడానికి 35 వేలకు పైగా గదులు ఉండాలని, కానీ ఎక్కడున్నాయో చెప్పాలని నిలదీశారు .అన్ని రూమ్స్ ను, సిబ్బందిని ప్రభుత్వం సిద్ధం చేసిందా అని ప్రశ్నించారు. పరీక్షల నిర్వహణకు కనీస ఏర్పాట్లు చేయకుండా మొండి పట్టుదలతో పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు లోకేష్.
ప్రభుత్వానికి ప్రజల ప్రాణాలంటే లెక్కలేదు
జగన్ రెడ్డి మూర్ఖత్వానికి పరీక్షల నిర్వహణ నిర్ణయం పరాకాష్ట అని, అదే విషయాన్ని సుప్రీంకోర్టు కూడా స్పష్టం చేసిందని పేర్కొన్నారు. పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడితే పోయే ఒక్కో ప్రాణానికి కోటి రూపాయల పరిహారం చెల్లించాలని సుప్రీం ధర్మాసనం పేర్కొనడాన్ని బట్టి ప్రభుత్వానికి ప్రజల ప్రాణాలంటే లెక్కలేదు అనే విషయం బయటపడిందని మండిపడ్డారు. తక్షణమే, పరీక్షలను రద్దు చేస్తున్నట్లుగా నిర్ణయం తీసుకొని ఆ విషయాన్ని సుప్రీంకోర్టు కి తెలపాలని లోకేష్ డిమాండ్ చేశారు.