గుంటూరు జిల్లాలో మరో వైసిపి నేతకు షాకిచ్చిన జగన్: నైరాశ్యంలో అప్పిరెడ్డి
గుంటూరు:పార్టీలో కొత్తగా చేరిన నేతలకు సీట్లను కట్టబెడుతూ ఎప్పటినుంచో తననే నమ్ముకున్న నాయకులకు షాకిస్తున్న వైసిపి అధినేత జగన్ నిర్ణయాలు రాజకీయ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారాయి.
తాజాగా గుంటూరు జిల్లాకు సంబంధించి జగన్ తీసుకున్న ఒక నిర్ణయం ఆ పార్టీ పాత కాపు లేళ్ల అప్పిరెడ్డిని దిగ్భ్రాంతి పరిచింది. గత ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన అప్పిరెడ్డి ఈ ఎన్నికల్లోనూ తనకు సీటు గ్యారెంటీ అనే నమ్మకంతో ఉన్నారు. అయితే అనూహ్యంగా ఈ నియోజకవర్గానికి ఇన్ ఛార్జ్ గా కొత్తగా చేరిన చంద్రగిరి ఏసు రత్నంను నియమించడంతో షాక్ తిన్న అప్పిరెడ్డి తీవ్రనైరాశ్యంలో మునిగిపోయారు.
ఈమధ్యకాలంలో జగన్ తీసుకున్న నిర్ణయాలను ఒక్కసారి పరిశీలిస్తే మల్లాది విష్ణు కోసం వంగవీటి రాధా స్థానాన్ని మార్పు చేయడం, ఆనం కోసం బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డిని దూరం పెట్టడం, గుంటూరు జిల్లా చిలకలూరిపేట నుంచి మర్రి రాజశేఖర్ను కాదని విడదల రజనీకుమారి కో ఆర్డినేటర్ గా నియామకం, గుంటూరు ఎంపి స్థానం లావు శ్రీకృష్ణదేవరాయలును కాదని కిలారి రోశయ్యకు కట్టబెట్టడం...ఇప్పుడు ఇదే క్రమంలో గుంటూరు జిల్లా వైసిపి కీలక నేత లేళ్ల అప్పిరెడ్డిని పక్కనపెట్టి యేసురత్నానికి పదవి కేటాయించడం...ఇలా జగన్ తీసుకుంటున్న నిర్ణయాలతో ఇప్పటి వరకూ పార్టీ టికెట్పై ఆశలు పెట్టుకున్న ఆ నేతలు తీవ్ర నిరాశ చెందారు.

ఇక లేళ్ల అప్పిరెడ్డి విషయానికొస్తే ఒకప్పటి యూత్ కాంగ్రెస్ లీడర్ నుంచి ఆ తరువాత వైఎస్ హయాంలో మిర్చి యార్డ్ ఛైర్మన్ గా...ఆ తరువాత వైసిపి గుంటూరు అర్బన్ అధ్యక్షుడిగా...వీటన్నింటికీ మించి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి వీర విధేయుడిగా సుపరిచితం. జగన్ ఆర్థిక బలమే ప్రామాణికంగా తీసుకుంటూ పార్టీ పాత కాపుల్ని సైతం తోసిరాజంటున్నట్లు ఎంత ప్రచారం జరుగుతున్నా...తన స్థానానికేమీ ఢోకా ఉండదని అప్పిరెడ్డి భావించారు. అందుకే తాను గత ఎన్నికల్లో ఓటమి పాలైన గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఈసారి గెలిచి తీరాలని విస్తృతంగా పర్యటనలు,పార్టీ కార్యక్రమాలు చేస్తూ ఉన్న క్రమంలో పార్టీలో కొత్తగా చేరిన ఏసు రత్నంను పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్తగా జగన్ నియమించడంతో అప్పి రెడ్డి దిగ్భ్రాంతికి...ఆయన అనుచర వర్గం షాక్కు గురవడం జరిగింది.
ఈ క్రమంలో తమ అభిమాననేతకు జగన్ మొండిచేయి చూపడంతో ఆయన అనుచరులు తీవ్ర ఆగ్రవేశాలకు లోనవుతున్నారు. ఈ విషయం తెలిసిన అప్పిరెడ్డి అనుచరులు కార్యాలయానికి భారీ సంఖ్యలో చేరుకున్నారు. పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రాధాన్యత లేని చోట ఉండవద్దని, పార్టీ నుంచి బయటకు రావాలని అప్పిరెడ్డిపై అనుచరులు ఒత్తిడి తెస్తున్నారు. లేళ్ల మాత్రం మరోసారి అధిష్టానంతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం.
అందుకే ఈ విషయమై ఆచితూచి స్పందించిన అప్పిరెడ్డి తనకు పదవులు ముఖ్యం కాదని, తన బలం, బలగం అభిమానులేని వైసీపీ నేత అప్పిరెడ్డి అన్నారు.
వైసీపీలో కొత్తగా చేరిన నేతలకు న్యాయం చేయాలన్న ఉద్దేశంతో జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు అప్పటి వరకూ పార్టీని నమ్ముకుని ఉన్న నేతలను నైరాశ్యంలోకి నెట్టేస్తున్నాయని అప్పిరెడ్డి చెప్పారు. పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆవేశంతో ఉన్న తన అభిమానులను ఉద్దేశించి మట్లాడుతూ నాలుగు రోజుల పాటు అందరితో వ్యక్తిగతంగా మాట్లాడతానని, అభిమానులు ఎవరూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని సూచించారు. అభిమానుల అభిప్రాయం మేరకే నడుచుకుంటానని అప్పిరెడ్డి ఈ సందర్భంగా స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications