జగన్ సర్కార్ కీలక నిర్ణయం-సీపీఎస్ రద్దుపై మంత్రుల కమిటీ- జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో ప్రకటన
ఏపీలో వైసీపీ ఎన్నికలకు ముందు ఇచ్చిన సీపీఎస్ రద్దు హామీకి మూడేళ్లు పూర్తయినా ఇంకా అమలు కాకపోవడంపై ఉద్యోగులు గుర్రుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ జరిగిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ భేటీలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీపీఎస్ రద్దుపై చర్చించేందుకు ఐదుగురు మంత్రులతో కమిటీ ఏర్పాటు చేసింది.
ఉద్యోగ సంఘాలతో చర్చలకు మంత్రుల కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ఇవాళ సచివాలయంలో జరిగిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ భేటీలో ప్రభుత్వం ప్రకటించింది. సీపీఎస్పై చర్చించేందుకు ఐదుగురు సభ్యులతో మంత్రుల కమిటీ వేస్తున్నట్లు ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు. ఈ మేరకు మంత్రుల కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ ఆదేశాలు జారీ అయ్యాయి. ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సమావేశమై మంత్రుల కమిటీ చర్చలు జరపనుంది.
చర్చల సారాంశాన్ని, తుది నివేదికను మంత్రుల కమిటీ ప్రభుత్వానికి సమర్పించనుంది.

ఉద్యోగుల సీపీఎస్ రద్దుపై చర్చించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలో ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, మున్సిపల్ మంత్రి ఆదిమూలపు సురేష్ తో పాటు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎస్ సమీర్ శర్మ ఉంటారని ప్రభుత్వం తెలిపింది. అయితే ఈ ప్రతిపాదనను ఉద్యోగసంఘాలు ఏమేరకు అంగీకరిస్తాయో చూడాల్సి ఉంది. ఇప్పటికే సీపీఎస్ రద్దు డిమాండ్ నెరవేర్చడం సాధ్యం కాదని ఓసారి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తేల్చిచెప్పేశారు. ఈ నేపథ్యంలో కమిటీ ఏం చర్చించబోతోందన్నది కీలకంగా మారింది. ఉద్యోగులు మాత్రం సీపీఎస్ రద్దుకు ప్రత్యామ్నాయం లేదని చెప్తున్నారు.












Click it and Unblock the Notifications