ఏపీ ఉద్యోగుల హెచ్చరికల ఫలితం-రేపు మరోసారి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ భేటీ ఏర్పాటు
ఏపీలో దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న పీఆర్సీ సహా ఇతర డిమాండ్ల పరిష్కారం కోసం ఉద్యోగులు ఆందోళన బాట పట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 7వ తేదీ లోగా సమస్య పరిష్కారంపై ప్రభుత్వం స్పందించకపోతే భవిష్యత్ కార్యాచరణ చేపడతామని ఇప్పటికే సీఎస్ సమీర్ శర్మకు ఉద్యోగులు నోటీసులు కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం స్పందించింది.
ఏపీలో ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై చర్చించేందుకు ప్రభుత్వం మరోసారి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ భేటీ ఏర్పాటు చేసింది. ఉద్యోగుల సమస్యలపై చర్చ కోసం రేపు ప్రభుత్వం జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ భేటీ నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉద్యోగ సంఘాలకు సమాచారం ఇచ్చింది. ఈ భేటీకి హాజరై తమ సమస్యలపై చర్చించాలని వారిని ఆహ్వానించింది. గతంలో పలుమార్లు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాలు ఏర్పాటు చేసినా సమస్యల పరిష్కారం కాలేదు. దీంతో ఉద్యోగులు ప్రభుత్వంపై ఆగ్రహంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో రేపటి భేటీ ఎలా జరగబోతోందన్నది ఆసక్తి రేపుతోంది.
గత జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ భేటీకి హాజరైన ప్రధాన ఉద్యోగ సంఘాలు.. మధ్యలోనే బాయ్ కాట్ చేసి వెళ్లిపోయాయి. ప్రభుత్వ తీరుకు నిరసనగా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ భేటీని బహిష్కరించాయి. దీంతో ఈసారి భేటీలో ఏం జరగబోతోందన్నది ఆసక్తి రేపుతోంది. వాస్తవానికి ఉద్యోగులు కోరుతున్న విధంగా పీఆర్సీ నివేదికతో పాటు సీపీఎస్ రద్దు, డీఎ బకాయిల చెల్లింపు వంటి ఇతర సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం ఏదో ఒక హామీ ఇవ్వాల్సిందేనని జేఏసీలు పట్టుబడుతున్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం ఉద్యోగుల కోసమే తాము పనిచేస్తున్నామని చెబుతోంది. దీన్ని చేతల్లో చూపించాలని ఉద్యోగులు కోరుతున్నారు.
మరోవైపు ఉద్యోగులు ఈసారి ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తీరుపై గుర్రుగా ఉన్నారు. ఆర్ధికమంత్రి బుగ్గన ఉద్యోగులను చులకన చేసి మాట్లాడటంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బుగ్గన తీరు వల్లే ప్రభుత్వానికీ, తమకూ మధ్య గ్యాప్ పెరుగుతోందని నిన్న ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆరోపించారు. దీంతో రేపటి భేటీలోనూ ఆర్ధికమంత్రి తీరుపై ఉద్యోగులు ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశముంది.