జగన్ సర్కార్ నిజంగా ఉద్యోగుల జీపీఎఫ్ విత్ డ్రా చేయలేదా ? అసలు వాస్తవమిదే..
ఉద్యోగులకు తెలియకుండా ప్రభుత్వ ఉద్యోగుల GPF ఖాతాల నుండి విత్డ్రాలను గురించి మీడియాలో వస్తున్న వార్తలపై ఇవాళ జగన్ సర్కార్ వివరణ ఇచ్చింది. ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలు కూడా ఇదే విషయాన్ని పదే పదే ప్రస్తావిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.ఇందులో ప్రభుత్వం డైరెక్టర్ ఆఫ్ ట్రెజరిస్ ను ఈ విషయంపై విచారణ చేసి సమగ్ర నివేదికను సమర్పించాలని ఆదేశించినట్లు తెలిపింది. DTA అందించిన ప్రాథమిక సమాచారం ఆధారంగా ఈ వివరణ ఇస్తున్నట్లు ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్ తెలిపారు.
అనధికారిక పద్ధతిలో ఉద్యోగుల ఖాతాల నుండి GPF మొత్తాలు విత్డ్రా జరిగినట్లు మీడియాలో వచ్చిన కథనాలు నిజం కాదని ప్రభుత్వం తెలిపింది. ఇది కేవలం ఉద్యోగుల GPF ఖాతాకు డియర్నెస్ అలవెన్స్ (DA) బకాయిల సర్దుబాటుకు సంబంధించినదని వెల్లడించింది. GPFకు సర్దుబాటు చేయడం, నగదు రూపంలో చెల్లించడం వంటి అంశాలు ఇందులో ఉన్నాయని, DA బకాయిల బిల్లులు ప్రక్రియ ప్రకారం DTA ద్వారా ఆమోదం పొందిన తర్వాత క్లియరెన్స్ కోసం చెల్లింపు కోసం పంపినట్లు పేర్కొంది.
సాంకేతిక లోపం కారణంగా చెల్లింపు దరఖాస్తులో బిల్లులు క్లియర్ కానప్పటికీ, డి.ఎ బకాయి మొత్తాలను ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాలో తప్పుగా జమ చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. ట్రెజరీ నిబంధనల ప్రకారం, మార్చి 31 నాటికి పెండింగ్లో ఉన్న అన్ని బిల్లులు ప్రతి సంవత్సరం సంబంధిత ట్రెజరీ అధికారి ద్వారా రద్దు చేస్తామని వెల్లడించింది. చెల్లించని DA బకాయి బిల్లుల రద్దు కారణంగా, ఉద్యోగుల GPF ఖాతాలకు తప్పుగా జమ చేయబడిన సర్దుబాటు మొత్తాలు కూడా సిస్టమ్ సాఫ్ట్వేర్ ద్వారా రివర్స్ చేసినట్లు ప్రభుత్వం తెలిపింది.
ఉద్యోగుల GPF ఖాతా నుండి పై లావాదేవీలను మినహాయించి, ఇతర ఆటో డెబిట్లు ఏవీ జరగలేదని సర్కార్ స్పష్టం చేసింది. సాంకేతిక లోపాన్ని సరిదిద్దడానికి ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటోందని వెల్లడించింది. ఉద్యోగులు డీఏ బకాయిలు చెల్లించినప్పుడు వారి GPF ఖాతాలలో కనపడేలా DA బకాయిల మొత్తం క్రెడిట్ చేస్తామని ప్రకటించింది. సమయానుకూల పద్ధతిలో ఉద్యోగి ప్రయోజనాలు, డీఏ బకాయిలు, ఇతర చెల్లింపుల కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఉద్యోగులలో ఏ ఒక్కరి GPF ఖాతా నుండి ఇతర ఆటో డెబిట్లు జరగలేదని ఆర్ధికశాఖ తరఫున ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వెల్లడించారు.