జగన్ సర్కార్ కీలక నిర్ణయం-ఇక ఏపీలో రెండో అధికార భాషగా ఉర్దూ-నోటిఫికేషన్ జారీ
ఏపీలో ఎన్నో ఏళ్లుగా ఉన్న ఓ కీలక డిమాండ్ కు జగన్ సర్కార్ మోక్షం లభించింది. రాష్ట్రంలో అధికార బాషగా తెలుగు కొనసాగుతుండగా.. ఆ తర్వాత స్దానంలో రెండో అధికార భాషగా ఉర్దూను గుర్తించాలనే డిమాండ్లు ఎప్పటి నుంచో ఉన్నాయి. దీనికి ఎట్టకేలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఆంధ్రప్రదేశ్లో ఉర్దూకు రెండో అధికార భాషగా గుర్తింపు లభించింది. ఉర్దూను రాష్ట్ర రెండవ అధికారిక భాషగా గుర్తిస్తూ జగన్ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలలోని వెంటనే దీనిని అమలు చేయాలని ప్రభుత్వం ఈ నోటిఫికేషన్ లో ఆదేశాలు ఇచ్చింది. గత అసెంబ్లీ సమావేశాలలో ప్రవేశపెట్టిన అధికార భాషల చట్ట సవరణ-2022 బిల్లును సభ ఆమోదించింది. డిప్యూటీ సీఎం అంజాద్ బాషా ఈ బిల్లును ప్రతిపాదించగా సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. దీంతోపాటు రాష్ట్రంలో మైనార్టీల భద్రత, సామాజిక అభ్యున్నతి కోసం ప్రవేశపెట్టిన ఏపీ మైనార్టీస్ కాంపొనెంట్, ఆర్ధిక వనరులు, వ్యయ కేటాయింపులు, వినియోగ చట్టం 2022కు కూడా నాడు అసెంబ్లీ ఆమోదం లభించింది.
ఇక ఉర్దూకు రాష్ట్ర రెండవ అధికార భాషగా గుర్తింపు దక్కడంపై మంత్రి అంజాద్ బాషా మాట్లాడుతూ.. ఉర్దూ ఓ మతానికి సంబంధించిన భాష కాదన్నారు. తెలుగుతో సమానంగా ఉర్దూకు కూడా సమాన హోదా లభించినందుకు సీఎం జగన్కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కాగా, పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో ఉర్దూ ఇప్పటికే రెండో అధికారిక భాషగా కొనసాగుతోంది. ఉర్దూను అధికారిక భాషగా గుర్తించడంతో ఇకపై రాష్ట్ర ప్రభుత్వ అధికార కార్యకలాపాలు, ఉత్తర, ప్రత్యుత్తరాలు తెలుగుతో పాటు ఉర్దూలో కూడా కొనసాగనున్నాయి.