అంతర్వేది కేసు సీబీఐకి అప్పగింత- ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం
ఏపీలో తీవ్ర వివాదాస్పదమవుతున్న అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి ఆలయ రథం దగ్ధం ఘటనపై ఏపీ ప్రభుత్వం సీబీఐ దర్యాప్తుకు ఆదేశించింది. అంతర్వేది ఘటనపై పోలీసులు దాఖలు చేసిన కేసును సీబీఐకి బదలాయిస్తూ ప్రభుత్వం ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. అంతర్వేది ఘటన తీవ్ర కలకలం రేపుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Recommended Video
తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో లక్ష్మీనరసింహ స్వామి ఆలయ రథాన్ని కొందరు దగ్ధం చేశారు. దీనిపై విపక్ష బీజేపీ, టీడీపీ, జనసేనతో పాటు హిందూ సంస్ధలు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. సీబీఐ విచారణతో పాటు జ్యుడిషియల్ విచారణకు సైతం డిమాండ్ చేశాయి. అంతర్వేది ఆలయ సందర్శనకు వెళ్లిన మంత్రులను స్వామీజీలు, వీహెచ్పీ కార్యకర్తలు అడ్డుకున్నారు. తీవ్ర ఉద్రిక్తతల మధ్య వారు వెనుదిరిగారు.
అంతర్వేది ఘటనకు నిరసనగా ఛలో అంతర్వేదికి పిలుపునిచ్చిన బీజేపీ, జనసేన నేతలను పోలీసులు అడ్డుకుని హౌస్ అరెస్టులు చేశారు. అనంతరం బీజేపీ ఛీఫ్ సోము వీర్రాజును మాత్రం అనుమతించారు. ఆ తర్వాత ఈ ఘటనపై బీజేపీ, జనసేన నిన్న ధర్మ పరిరక్షణ దీక్షలు కూడా నిర్వహించాయి. ప్రభుత్వంపై పెరుగుతున్న ఒత్తిడిని దృష్టిలో ఉంచుకుని సీబీఐ విచారణ జరిపించాలని నిన్న సీఎం జగన్ నిర్ణయించారు. ఇవాళ ఇందుకు అనుగుణంగా ఉత్తర్వులు జారీ చేశారు.