జగన్ సర్కారుకు రాకియా దెబ్బ- కేంద్రం ఒత్తిళ్లు- వాటా కొనుగోలుతో బయటపడే యత్నం
విశాఖ మన్యంలో బాక్సైట్ తవ్వకాల కోసం గతంలో యూఏకీకి చెందిన రాకియా సంస్ధతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించడంతో ఎదురవుతున్న సమస్యలను తప్పించుకునేందుకు జగన్ సర్కారు ప్రత్యామ్నాయ ప్రతిపాదనలతో సిద్ధమవుతోంది. రాకియా సంస్ధ విశాఖలో ఏర్పాటు చేసిన అన్రాక్ అల్యూమినియం జాయింట్ వెంచర్లో పెట్టిన పెట్టుబడి వాటాను తిరిగి ఇచ్చేయడం ద్వారా అంతర్జాతీయ కోర్టుల్లో నలుగుతున్న ఆర్బిట్రేషన్ వివాదం నుంచి బయటపడేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ మేరకు ప్రభుత్వం నియమించిన ఆరుగురు అధికారుల కమిటీ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
జగన్కు చుక్కలు చూపిస్తున్న వైఎస్ డీల్
2007లో విశాఖ మన్యంలో 224 మెట్రిక్ టన్నుల బాక్సైట్ తవ్వకాల కోసం గతంలో మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో యూఏకి చెందిన రస్ అల్ ఖైమా ఇన్వెస్ట్మెంట్ అథారిటీ (రాకియా)తో ఏపీ ప్రభుత్వానికి ఒప్పందం కుదిరింది. ఈ డీల్ ప్రకారం విశాఖ మన్యంలో బాక్సైట్ తవ్వకాలు జరపడంతో పాటు ఆ తర్వాత దాన్ని శుద్ధిచేసి అల్యూమినియంగా మార్చేందుకు అన్రాక్ అల్యూమినియం పేరుతో ఓ జాయింట్ వెంచర్ను కూడా ఏర్పాటు చేశారు. అయితే వైఎస్ అకాల మరణం తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఈ డీల్ను నిర్లక్ష్యం చేయడం, సీబీఐ కేసులతో ఇది అటకెక్కింది.
ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు ప్రభుత్వంతో పాటు ప్రస్తుత జగన్ సర్కారు సైతం బాక్సైట్ తవ్వకాల కోసం గతంలో వైఎస్ చేసుకున్న ఒప్పందాలు రద్దు చేసేశాయి. అయితే అర్ధాంతరంగా రద్దయిన రాకియా డీల్ ఇప్పుడు అధికారంలో ఉన్న జగన్ సర్కారు మెడకు చుట్టుకుంది.
అంతర్జాతీయ ఆర్బిట్రేషన్కు వెళ్లిన రాకియా
ఎప్పుడైతే 2016లో చంద్రబాబు ప్రభుత్వం విశాఖ మన్యంలో బాక్సైట్ తవ్వకాలను రద్దు చేసిందో అప్పుడే రాకియా దీనిపై న్యాయపోరాటం మొదలుపెట్టింది. ముందూ వెనుకా చూసుకోకుండా గిరిజనుల కోసం బాక్సైట్ తవ్వకాలను రద్దు చేయడం వల్ల విశాఖలో అల్యూమినియం శుద్ధి కోసం 7 వేల కోట్లతో ఏర్పాటు చేసిన అన్రాక్ అల్యూమినియం కూడా పనికి రాకుండా పోయింది. చంద్రబాబు తర్వాత వచ్చిన జగన్ సర్కారు సైతం బాక్సైట్ లీజులను పూర్తిగా రద్దు చేసేసిందో ఇక ఏపీ సర్కారుతో పాటు భారత ప్రభుత్వాన్ని కూడా రాకియా అంతర్జాతీయ ఆర్బిట్రేషన్కు లాగింది. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇరుకునపడ్డాయి.
ఏపీ సర్కార్ తీరుపై కేంద్రం ఆగ్రహం
ఏపీ ప్రభుత్వం అంతర్జాతీయ సంస్ధతో భారీ ఒప్పందాలు చేసుకుని అర్ధాంతరంగా రాజకీయ ప్రయోజనాల కోణంలో వాటిని రద్దు చేసుకోవడంపై కేంద్రం ఆగ్రహంగా ఉంది. అంతర్జాతీయ ఆర్బిట్రేషన్కు వెళ్లిన రాకియా తమతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం బాక్సైట్ సరఫరా చేయాలని లేదా తాము పెట్టుబడిగా పెట్టిన మొత్తాన్ని పరిహారంతో పాటు వెనక్కి ఇవ్వాలని న్యాయపోరాటం చేస్తోంది. దీంతో భారత్ పరువు బజారున పడేలా ఉంది. అలాగని రాకియా డీల్ మొత్తాన్ని వెంటనే తిరిగి చెల్లించలేని పరిస్ధితుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి. దీంతో రాకియాతో సంప్రదింపులు జరిపి ఏదో ఒకటి తేల్చాలని ఏపీ ప్రభుత్వంపై కేంద్రం ఒత్తిడి పెంచుతోంది. ఈ నేపథ్యంలో జగన్ సర్కారు ఐఏఎస్ గోపాలకృష్ణ ద్వివేదీ నేతృత్వంలో ఆరుగురు సభ్యుల కమిటీ వేసి ప్రత్యామ్నాయ మార్గాలు వెతుకుతోంది.
రాకియా వాటా కొనుగోలుతో బయటపడే యత్నం
రాకియాతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం 224 మెట్రిక్ టన్నుల బాక్సైట్ సరఫరా చేయాలంటే విశాఖ మన్యంలో బాక్సైట్ తవ్వకాలు రద్దు చేశారు. దీంతో పక్కనే ఉన్న ఒడిశా నుంచి తీసుకోవాలని ప్రయత్నించినా అరకొరగా ఉన్న ఖనిజాన్ని వేలం పాటలో తీసుకోవాలని నవీన్ పట్నాయక్ ప్రభుత్వం తేల్చిచెప్పేసింది. ఒక వేళ కేంద్రాన్ని బతిమాలి ఒడిశా నుంచి ఖనిజం తీసుకున్నా అది సరిపోదు.
దీంతో రాకియా అన్రాక్ అల్యూమినియంలో పెట్టుబడిగా పెట్టిన 44.71 మిలియన్ డాలర్ల వాటాను ప్రభుత్వమే కొనుగోలు చేయక తప్పని పరిస్ధితి. కాబట్టి ఆ దిశగా అధికారుల కమిటీ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వాటను ప్రభుత్వం కొనుగోలు చేసి డబ్బులు చెల్లిస్తే రాకియా ఆంతర్జాతీయ ఆర్బిట్రేషన్ ఉపసంహరించుకునే అవకాశం ఉంటుంది.