ఇళ్ల నిర్మాణంలో జగన్ సర్కార్ రికార్డు-రివర్స్ టెండరింగ్ తో రూ.6500 కోట్ల ఆదా
ఏపీలో రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇచ్చిన ఇళ్ల స్ధలాల్లో జగనన్న కాలనీల నిర్మాణం కోసం ప్రయత్నిస్తోంది. ఇందుకోసం లబ్ది దారులకు తామే ఇసుకతో పాటు ఇతర సామాగ్రిని కూడా కొనుగోలు చేసి సరఫరా చేస్తోంది. దీంతో ఇళ్ల నిర్మాణాన్ని నాణ్యంగా ఉండేలా చూస్తోంది. ఇందుకోసం గతంలో కాంట్రాక్టర్లు ఇచ్చిన ధరలపై రివర్స్ టెండరింగ్ నిర్వహించి మరోసారి సక్సెస్ అయింది.
ఏపీలో గృహనిర్మాణశాఖ నిర్మిస్తున్న గృహాలకు అవసరమైన ఇసుక, ఇతర సామాగ్రి కొనుగోళ్లలో రివర్స్ టెండరింగ్ నిర్వహించిన ప్రభుత్వం ఏకంగా రూ.6500 కోట్ల రూపాయలు ఆదా చేసింది. ఇందులో ఇసుకను మినహాయించినా రూ.5120 కోట్లు ఆదా అయ్యాయి. ప్రస్తుతం ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రతీ ఇంటికీ 14 వస్తువులకు గానూ రూ. లక్షా 31 వేల 676 ఖర్చు అవుతుండగా.. రివర్స్ టెండరింగ్ నిర్వహించడం ద్వారా రూ. 88 వేల 854 మేర భారం తగ్గింది. దీంతో లబ్ది దారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

అదే సమయంలో గృహనిర్మాణ సామాగ్రి నాణ్యతలో కూడా రాజీపడరాదని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో లబ్ది దారులు కోరుకున్న విధంగా ఐఎస్ఐ మార్క్ ఉన్న వస్తువులే ఏపీ ప్రభుత్వం సరఫరా చేయనుంది. తద్వారా ఇళ్ల నిర్మాణం నాణ్యతతో కూడుకుని ఉంటుందని భావిస్తున్నారు. తొలి విడతలో నిర్మించే ఇళ్లలోనే ఇంత భారీ మొత్తంలో ఆదా కావడంపై ప్రభుత్వ వర్గాలు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. మిగతా విడతల్లోనూ రివర్స్ టెండరింగ్ ద్వారా భారీ మొత్తాల్ని ఆదా చేయడంపై ప్రభుత్వం దృష్టిసారిస్తోంది. వైసీపీ ప్రభుత్వం వచ్చాక పలు శాఖల్లో రివర్స్ టెండరింగ్ ద్వారా కోట్లాది రూపాయల ప్రజా ధనం వృథా కాకుండా అడ్డుకట్ట వేయగలిగింది. పోలవరం సహా పలు కీలక ప్రాజెక్టుల్లోనూ ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ నిర్వహించడంతో వేల కోట్లు ఆదా అయ్యాయి. ఇప్పుడు ఇళ్ల నిర్మాణంలోనూ అదే పద్ధతి అవలంబిస్తోంది. దీన్ని మిగతా పనుల్లోనూ అమలు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది.












Click it and Unblock the Notifications